- సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సమ్మర్ హాలీడేస్లో టీచర్లకు మేనేజ్మెంట్ల వారీగా, కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన ప్రమోషన్లు, బదిలీలు జరిగేలా షెడ్యూల్ తయారు చేయాలని విద్యాశాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లోని తన చాంబర్లో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్రెడ్డి తదితరులు సీఎస్ సోమేశ్కుమార్ను కలిశారు. టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీచర్ల మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల ఉత్తర్వులు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ల పోస్టులను పది వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలానికో ఎంఈఓ ఉండేలా, పండిట్, పీఈటీ అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ బదిలీలు, ప్రమోషన్ల మార్గదర్శకాలను రెడీ చేయాలని విద్యాశాఖ సెక్రటరీకి సీఎస్ సోమేశ్ ఆదేశించినట్టు వారు చెప్పారు.