వేసవిలో టీచర్లకు  ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లు

వేసవిలో టీచర్లకు  ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లు
  • సీఎస్​ సోమేశ్ కుమార్ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: సమ్మర్ హాలీడేస్​లో టీచర్లకు మేనేజ్​మెంట్ల వారీగా, కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన ప్రమోషన్లు, బదిలీలు జరిగేలా షెడ్యూల్ తయారు చేయాలని విద్యాశాఖ సెక్రటరీ సందీప్​ కుమార్​ సుల్తానియాను సీఎస్​ సోమేశ్​కుమార్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్​లోని తన చాంబర్​లో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్​రెడ్డి, బీరెల్లి కమలాకర్​రావు, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్​రెడ్డి తదితరులు సీఎస్ సోమేశ్​​కుమార్​ను కలిశారు. టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీచర్ల మ్యూచువల్ ట్రాన్స్​ఫర్ల ఉత్తర్వులు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ల పోస్టులను పది వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలానికో ఎంఈఓ ఉండేలా, పండిట్, పీఈటీ అప్​గ్రేడేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.  సాధారణ బదిలీలు, ప్రమోషన్ల మార్గదర్శకాలను రెడీ చేయాలని విద్యాశాఖ సెక్రటరీకి సీఎస్ సోమేశ్ ఆదేశించినట్టు వారు చెప్పారు.