- ఎక్కువ బిల్లు వేసిన సూపర్ మార్కెట్
- ఆందోళనకు దిగిన కస్టమర్ సారీ చెప్పిన మేనేజ్మెంట్
శంషాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ మెట్రో హోల్ సేల్ సూపర్ మార్కెట్లో అధిక ధరలకు వస్తువులను అమ్ముతూ మోసానికి పాల్పడుతున్నారని ఓ కస్టమర్ మెట్రో సూపర్ మార్కెట్ ముందు ఆందోళనకు దిగాడు. గగన్ పహాడ్ కి చెందిన కిరణ్ సోమవారం షాపింగ్ కోసం మెట్రో హోల్ సేల్ సూపర్ మార్కెట్కు వెళ్లగా.. 4 సబ్బులకు రూ. 500, 10 పెన్నులకు రూ. 899, రెండు తేనె బాటిళ్లకు రూ. 565 బిల్లు వేశారు.
ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ వస్తువులకు ఉన్న ధరల కంటే అధికంగా రేట్లు వేశారని తెలుసుకుని వెళ్లి మెట్రో హోల్ సేల్ మార్కెట్ మేనేజర్ ను ప్రశ్నించాడు. బిల్లింగ్ వద్ద ఉన్న వ్యక్తి కొత్తవాడని ట్రైనింగ్లో ఉన్నారని చెప్పి పంపించారు. అయితే మళ్లీ వేసిన బిల్లులో కూడా రాంగ్గా రావడంతో తిరిగి బాధితుడు అక్కడికి చేరుకుని మేనేజర్తో వాగ్వాదానికి దిగాడు. దీంతో పోలీసులు రావడంతో బాధితుడు వారికి వివరించాడు. నిలదీయడంతో బాధితుడికి మెట్రో సూపర్ మార్కెట్ యాజమాన్యం సారీ చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.