- రూ.6 కోట్లతో 3 ఎకరాల్లో ఒలింపిక్ ప్రమాణాలతో ఏర్పాటు
- ‘సీఎంసీ’ సమావేశంలో15 అంశాలకు ఆమోదం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) హెడ్ ఆఫీసులో స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సీఎంసీ కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు. మొత్తం 15 అంశాలకు ఆమోదించారు. మేడ్చల్ చెక్పోస్ట్ సమీపంలోని స్టేడియం స్థలంలో భారత్, సార్క్ దేశాల్లోనే తొలి యూసీఐ ఒలింపిక్ ప్రమాణాల 5 మీటర్లు, 8 మీటర్ల ‘డ్యూయల్ హిల్ బీఎంఎక్స్ సూపర్క్రాస్ ట్రాక్ ’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
370 నుంచి 400 మీటర్ల పొడవుతో ఈ ట్రాక్ను 3 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ట్రాక్కు అనుబంధంగా వార్మప్ పంప్ ట్రాక్, గ్యాలరీలు, పరిపాలనా కార్యాలయ భవనం, పరికరాల నిల్వ గదులు, మరుగుదొడ్లు, వాచ్మెన్ క్యాబిన్, ఫ్లడ్లైటింగ్, ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సుమారు రూ.6 కోట్లుగా అంచనా వేశారు.
అమీన్పూర్లో బయోమెథనైజేషన్ ప్లాంట్
స్వచ్ఛ భారత్ మిషన్-2.0లో భాగంగా అమీన్పూర్లో రోజుకు 50 టన్నుల సామర్థ్యంతో బయోమెథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుకు కమిటీ ఆమోదం తెలిపింది. చికెన్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడంతో పాటు గ్రీన్ వేస్ట్ను బయో-బ్రికెట్లుగా మార్చే ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మహదేవపురంలోని యానిమల్ కేర్ సెంటర్లో కుక్కల షెల్టర్లను విస్తరించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు.
బాచుపల్లి నుంచి నిజాంపేట్ రోడ్డులోని మల్లన్న టెంపుల్ వరకు ప్రతిపాదిత 30 మీటర్ల వెడల్పు రహదారి కోసం రోడ్ డెవలప్మెంట్ ప్లాన్కు ఆమోదం లభించింది. అలాగే సీఎంసీ లోగోను సీఎంసీ కార్యాలయాలు, పార్కులు, ఇతర ఆస్తులు, సైన్బోర్డులపై ప్రదర్శించేందుకు కమిటీ
ఆమోదం తెలిపింది.
