- హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల ఆదాయం
హైదరాబాద్, వెలుగు: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్బీ) కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు మరోసారి భారీ ధర పలికింది. ఎలాంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్బీ 7వ ఫేజ్లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం గరిష్టంగా రూ.2.70 లక్షలకు అమ్ముడైంది. ఓ ప్లాట్ చదరపు గజం రూ.2.36 లక్షలకు, మరో రెండు ప్లాట్లు రూ.2.06 లక్షల చొప్పున విక్రయమయ్యాయి. గత నెల 10న హౌసింగ్ బోర్డు ఈ ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించింది. బహిరంగ వేలంలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకునేందుకు 19 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. వేలంలో చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలు పలికినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ బహిరంగ వేలం ద్వారా బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.
మోకిలలో గజానికి రూ.87,500..
హెచ్ఎండీఏ భూముల ఈ-వేలానికి రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. బుధవారం మోకిల, బాచుపల్లి లేఅవుట్లలోని 70 నివాస ప్లాట్లకు నిర్వహించిన వేలంలో 57 ప్లాట్లు అమ్ముడయ్యాయి. మోకిలలో గజానికి గరిష్ఠంగా రూ.87,500 ధర పలికింది. మోకిల లేఅవుట్లో 32 ప్లాట్లు విక్రయించగా.. గజానికి సగటు ధర రూ.63,511గా నమోదైంది. ఈ వేలం ద్వారా హెచ్ఎండీఏకు సుమారు రూ.66.48 కోట్ల ఆదాయం వచ్చింది. బాచుపల్లి లేఅవుట్లో 25 ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఇక్కడ గజానికి గరిష్ఠంగా రూ.67,500, సగటున రూ.51,991 ధర పలికింది. ఈ వేలం ద్వారా సుమారు రూ.35.03 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బిడ్డర్లు వేలంలో పాల్గొన్నారు.
