నకిలీ జీవోలతో వందల కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు

నకిలీ జీవోలతో వందల కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు
  • గండిపేటలో 10 ఎకరాలు కాజేసేందుకు యత్నించిన ముఠా గుట్టురట్టు
  • ప్రభుత్వ ఆస్తి అని హైకోర్టు చెప్పినా.. ఐదు నకిలీ జీవోలు సృష్టించి వాట్సాప్‌‌‌‌లో వైరల్
  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సహా మొత్తం 8 మందిపై కేసు 

గచ్చిబౌలి, వెలుగు: నకిలీ ప్రభుత్వ జీవోలను సృష్టించి, వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రధాన సూత్రధారిగా ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు బొల్లా రమేశ్, సునీల్, రాధాకృష్ణ పరారీలో ఉన్నారు. కేసు వివరాలను శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో మీడియాకు వివరించారు.

 రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో సుమారు 104 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 10 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి తమదేనంటూ గండిపేట గ్రామానికి చెందిన నిమ్మల రాజేశ్ గౌడ్, వేణుగోపాల్, రామస్వామి, మంగ అనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు 2012లో హైకోర్టులో పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిరుడు అక్టోబర్ 6న హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టివేస్తూ.. ఆ 10 ఎకరాలు ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసింది.

కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ.. నిమ్మల కుటుంబ సభ్యులు ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్ర పన్నారు. ఇందుకోసం ఏకంగా ప్రభుత్వం తమకే ఆ భూమిని కేటాయించినట్టు ఐదు నకిలీ జీవోలను సృష్టించారు. వాటిని వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లలో వైరల్ చేశారు. ఈ క్రమంలోనే భూమిని విక్రయించడానికి ఏపీకి  చెందిన వినుకొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్‌‌‌‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఎకరాకు రూ.3.5 కోట్ల చొప్పున కుదిరిన డీల్‌‌‌‌లో భాగంగా.. నిందితుల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే నుంచి నిమ్మల కుటుంబానికి రెండు విడతలుగా దాదాపు రూ.4 కోట్ల వరకు డబ్బు చేతులు మారినట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఎమ్మార్వో ఫిర్యాదుతో వెలుగులోకి..

 ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలతో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో గండిపేట ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అక్రమాలు నిజం కావడంతో నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రాజేశ్, సాయికిరణ్‌‌‌‌తో పాటు నలుగురు ముఠా సభ్యులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.