అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న క్యాబ్ డ్రైవర్ అరెస్ట్

అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న క్యాబ్ డ్రైవర్ అరెస్ట్

హైదరాబాద్: అమ్మాయిల ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి, ఆ ఫోటోల‌తో వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. డ‌బ్బులు గుంజుతున్న ఓ క్యాబ్ డ్రైవ‌ర్‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా ఏకారం గ్రామానికి చెందిన టేకుల ఫనిందర్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ కాల్ సెంటర్‌లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేసే వాడు. ఆ కాల్ సెంటర్‌లోని అమ్మాయిలతో ఫోటోలు దిగి, వాటిని మార్ఫింగ్ చేసిన ప్రబుద్ధుడు..ఆ మార్ఫింగ్ ఫొటోలతో అమ్మాయిల బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవాడు. అత‌ని ప్ర‌వ‌ర్త‌నతో విసుగు చెందిన ఓ బాధిత యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో అత‌నిపై కేసు న‌మోదు చేసుకొని.. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మ‌రో ఘ‌ట‌న‌లో సోష‌ల్ మీడియా వేదిక‌గా అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తి ని అరెస్ట్ చేశారు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు. సూర్యాపేట జిల్లా నూతనకల్ గ్రామానికి చెందిన పి. కిరణ్ కుమార్… ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు డౌన్ లోడ్ చేసుకొని.. వాటి ద్వారా నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి, ఆ అమ్మాయిల ఫ్రెండ్స్ తో అసభ్యకర చాటింగ్ చేస్తుండేవాడు. ఓ బాధిత యువతి దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయ‌గా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడు కిరణ్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. పోలీసుల విచారణ లో నిందితుడు ఇప్పటికే 10 మంది అమ్మాయిల వేధించినట్లు వెల్లడించారు. అతనిపై ఇప్పటికే సూర్యాపేట, కోదాడ పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు న‌మోదైన‌ట్టు తెలిపారు.