
- రూ.681 కోట్లు దోచుకున్న నేరగాళ్లు
- ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో 8,866 మంది బాధితులు.. రూ.170 కోట్లు లూటీ
- రోజుకు సగటున 310 మంది విక్టిమ్స్.. రూ.4 కోట్ల మోసం
- దేశ వ్యాప్తంగా రూ.9,591 కోట్ల దోపిడీ
- 90 శాతం మంది బాధితులు చదువుకున్నోళ్లే
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ట్రేడింగ్, షేర్ మార్కెట్, తక్కువ టైమ్లో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ ఏడాది 6 నెలల్లోనే 8,866 మంది ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసాల బారినపడ్డారు. వీరి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ.170.65 కోట్లు కొట్టేశారు. సైబర్ సేఫ్టీపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు అత్యాశకు పోయి, మరికొందరు అవగాహన లేక డబ్బులు కోల్పోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు సగటున 310కి పైగా ఫిర్యాదులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందుతున్నాయి. వీళ్లు యావరేజ్గా సుమారు రూ.4 కోట్ల వరకు కోల్పోతున్నారు.
ఈ ఏడాది మొదటి 6 నెలల వ్యవధిలో 55,773 ఫిర్యాదులు అందగా.. 41,172 కేసుల్లో బాధితులు రూ.681 కోట్లు కోల్పోయారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 10.67 లక్షల ఫిర్యాదులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా అందాయి. వీటిలో రూ.9,591.41 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచేశారు. కాగా, రాష్ట్రంలో నమోదైన 189 కేసుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు చేసింది. రూ.92 కోట్లు కొల్లగొట్టిన 228 మంది సైబర్ క్రిమినల్స్ను అరెస్ట్ చేసింది. వీరికి దేశవ్యాప్తంగా నమోదైన 1,313 నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించింది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మోసాలు
ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఆన్లైన్లో లక్షలాది యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు సోషల్మీడియా ప్లాట్ఫామ్స్, కరెన్సీ నోట్లకు బదులు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్పే లాంటి పేమెంట్ గేట్వేస్ ద్వారా ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్నారు. వీటినే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాట్సప్, ఫేస్బుక్, ఎక్స్, టెలిగ్రామ్ ప్లాట్ఫామ్స్పై ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాట్సప్కు మెసేజ్లు, లింక్స్ పంపి సైబర్ నేరగాళ్లు అట్రాక్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్, వర్క్ ఫ్రమ్ హోం, ట్రేడింగ్, జాబ్, లోన్ ఫ్రాడ్స్ సహా పీఎం కిసాన్ యోజన, ముద్రా లోన్స్ పేరుతో ఆన్లైన్లో నకిలీ లింకులు పంపిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రాప్ చేసి, లింక్స్తో బ్యాంక్ అకౌంట్లను కొల్లగొడ్తున్నారు.
185 రకాల సైబర్ మోసాలు
ఆన్లైన్ వేదికగా దాదాపు 185 రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. రైతులు, కార్పొరేట్ కంపెనీలు సహా వ్యాపారవేత్తలు సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. ప్రతి ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 90 శాతం మంది బాధితులు విద్యా వంతులే ఉంటున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఎక్కువ మంది బాధితులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కర్నాటకకు చెందిన వాళ్లే ఉంటున్నారు. డార్క్ వెబ్సైట్ల నుంచి కొన్న ఫోన్ నంబర్లు, ఏజెన్సీల ద్వారా కలెక్ట్ చేసిన బ్యాంక్ అకౌంట్లతో వరుస మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ ఏడాది నమోదైన సైబర్ నేరాల్లో బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో జనవరి నుంచి జూన్ వరకు 41,172 కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు నమోదు చేశారు. ఇందులో బాధితులు రూ.681 కోట్లు కోల్పోయినట్లు గుర్తించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా రూ.107 కోట్లు ఆయా బ్యాంకుల్లో హోల్డ్ చేశారు. కోర్టుల ఆదేశాల మేరకు బాధితుల అకౌంట్లకు రీ ఫండ్ చేశారు.