ఆదిలాబాద్,వెలుగు : రహదారి నియమాలు కేవలం చట్టం కోసం కాదు, ప్రాణాలను కాపాడే కవచమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కింద ‘అరైవ్ అలైవ్’ రహదారి భద్రత అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలపై సమాజంలో అవగాహన పెంపొందించడంలో విద్యార్థుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అంతకుముందు పాఠశాల విద్యార్థులతో కలిసి ‘హెల్మెట్ - సేవ్ లైవ్స్’ ఆకారంలో భారీ మానవహారం నిర్వహించారు. ఆ తర్వాత చావర ప్రైవేట్ స్కూల్లో నూతనంగా ఏర్పాటైన ‘చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్’ను ప్రారంభించారు. విద్యార్థులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన ఉండాలన్నారు.
గతంలో ప్రమాదం జరిగితే సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందనే భయంతో ఎవరూ ముందుకు వచ్చేవారు కాదని, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'రహవీర్' అవార్డు ద్వారా ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల నగదు బహుమతితో పాటు సత్కారం అందిస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ మల్లెపూల నర్సయ్య, జిల్లా ఇంచార్జి కలెక్టర్ యువరాజు మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.

