తీవ్ర తుపానుగా ‘మోచా’

తీవ్ర తుపానుగా ‘మోచా’

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను ‘మోచా’ తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. గురువారం రాత్రికి పోర్టుబ్లెయిర్‌కు పశ్చిమంగా 520, మయన్మార్‌లోని సిట్వేకు దక్షిణ నైరుతి దిశగా ఒక వెయ్యి 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

ఇది ఉత్తర దిశగా పయనిస్తూ శుక్రవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం మలుపు తిరిగి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అత్యంత తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కాక్స్‌ బజార్‌ (బంగ్లాదేశ్‌), క్యాక్‌ప్యూ (మయన్మార్‌) మధ్య ఈ నెల 14న మధ్యాహ్నం తీవ్ర తుపానుగా బలహీనపడి తీరాన్ని దాటవచ్చని పేర్కొంది.

రాష్ట్రంలో ఉష్ణతీవ్రత మరింత పెరుగుతోంది. శుక్రవారం నుంచి ఇది మరింత తీవ్రరూపం దాల్చి వడగాడ్పులు వీయనున్నాయి. రానున్న ఐదు రోజులు కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులకు ఆస్కారం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐంఎండీ హెచ్చరించింది.