నాకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రాలేదు?.. ఎంపీడీవోను నిలదీసిన దళిత వితంతు

నాకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రాలేదు?.. ఎంపీడీవోను నిలదీసిన దళిత వితంతు

కాగజ్ నగర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో మొదట నా పేరు ఉందని, కానీ మంజూరు జాబితాలో ఎందుకు తొలగించారని ఎంపీడీవోను ఓ దళిత మహిళ నిలదీసింది. కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన అరికిల్ల పద్మ వితంతువు. మంజూరు జాబితాలో ఇల్లు రాకపోవడంతో మంగళవారం ఆమె ఎంపీడీవో ఆఫీస్ కు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి ఎంపీడీవోను నిలదీసింది. చిన్న తడకల గుడిసెలో తన వదినలు మాదేవి, రాజేశ్వరితో కలిసి ఉంటున్నానని, ముగ్గురం కూడా వితంతువులమేనని అన్నారు.

ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల సర్వే జాబితాలో తన పేరు వచ్చిందని, ఈ విషయాన్ని పంచాయతీ సెక్రటరీ స్వయంగా చెప్పారని పద్మ అన్నారు. కానీ ఇండ్ల మంజూరు జాబితాలో తన పేరు రాలేదని పేర్కొంది. తన పేరు ఎందుకు తొలగించారో చెప్పాలని ఎంపీడీవో రమేశ్​ను ప్రశ్నించింది. తనకు ఎలాంటి సంబంధం లేదని లిస్టును కలెక్టర్​కు పంపించామని అక్కడి అధికారులే మంజూరు చేశారని, వారినే అడగాలని సమాధానం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మండల కోఆప్షన్ మాజీ మెంబర్లు నయీం అహ్మద్, అజ్మత్ అలీ అక్కడకు చేరుకొని ఎంపీడీవోతో మాట్లాడారు. పేద దళిత వితంతు మహిళకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు.