ఏడేళ్ల పాటు ఆర్పీఎఫ్లో సేవలందించిన డాన్ శునకం పదవీ విరమణ చేసింది. ఉత్తరప్రదేశ్లోని మధుర ఆర్పిఎఫ్లో ముఖ్యమైన పాత్ర పోషించిన ‘డాన్’ అనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కుక్క - ఏడేళ్ల సర్వీసు తర్వాత పదవీ విరమణ చేసింది. దీంతో డాన్ డాగ్.. కొత్త యజమాని వద్దకు వెళ్లిపోయింది. డాన్ కొత్త యజమాని వరుణ్ సక్సేనా వేలంలో 10వేల 500కు డాన్ డాగ్ను సొంతం చేసుకున్నారు.
కుటుంబ సభ్యుడిగా చూసుకుంటా..
డాన్ డాగ్ను తాను గతంలోనే చూశానని కొత్త యజమాని వరుణ్ సక్సేనా తెలిపారు. దాన్ని వేలం వేస్తున్నట్లు తెలియగానే వేలంలో పాల్గొని కొనుగోలు చేసినట్లు చెప్పారు. వేలంలో డాన్ డాగ్ను దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. డాగ్ను తన సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటానని వెల్లడించారు.
అందువల్లే వేలం వేశాం..
డాన్ డాగ్ను రెండు నెలల వయస్సులో ఉన్నప్పుడు తీసుకున్నామని RPF అధికారి వర్మ తెలిపారు. దానికి శిక్షణ ఇచ్చి సొంత బిడ్డలా చూసుకున్నామన్నాడు. అయితే కొన్ని వైద్య పరిస్థితుల కారణంగా శనకాన్ని ప్రభుత్వ విధుల నుంచి తప్పించాల్సి వచ్చిందని..అందువల్లే దాన్ని వేలం వేయాల్సి వచ్చిందని ఆవేదనతో తెలిపారు.