పోలీసులు ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలకు తొత్తులుగా మారిన్రు

పోలీసులు ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలకు తొత్తులుగా మారిన్రు

హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో బాలికపై అఘాయిత్యం కేసులో పోలీసుల వైఖరిని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. ఈ కేసులో పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని వీడియో ఫుటేజ్ ఉన్నా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని శ్రవణ్ విమర్శించారు. ఎమ్మెల్యే కొడుకు ఘటనాస్థలంలో లేడని వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ చెప్పగా తాజాగా సీవీ ఆనంద్ ఎమ్మెల్యే కొడుకు కారు దిగి వెళ్లిపోయాడని చెప్పడాన్ని తప్పుబట్టారు.బాధితురాలి తండ్రి మే 31న ఫిర్యాదు చేస్తే కేసు నమోదుచేసేందుకు ఏడు రోజుల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కాకపోయి ఉంటే కేసు నుంచి ఎమ్మెల్యే కొడుకును తప్పించేవారని అన్నారు.

టీఆర్ఎస్ హయాంలో పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అన్నట్లుగా పరిస్థితి తయారైందని దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దిశ ఘటనలో నిందితుల వివరాలు నిమిషాల్లో బయటపెట్టిన పోలీసులు జూబ్లీహిల్స్ ఘటనకు సంబంధించిన వివరాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అఘాయిత్యానికి వాడిన కారు ఎవరిదో ఎందుకు చెప్పడం లేదని అన్నారు. పోలీస్ వ్యవస్థ ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలకు తొత్తుగా వ్యవహరిస్తోందని శ్రవణ్ ఆరోపించారు. 

హైదరాబాద్ అఘాయిత్యాలకు అడ్డాగా మారిందని, వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా  సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నోరు తెరవడం లేదని శ్రవణ్ మండిపడ్డారు. ask ktr పేరుతో ట్విట్టర్ లో పనికి మాలిన అంశాలపై స్పందించే కేటీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అన్నారు. డ్రగ్, పబ్ కల్చర్ కట్టడికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.