
నవీపేట్, వెలుగు: మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసగా మారాడని తండ్రిని కూతురు కొట్టి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ వినయ్ కుమార్, స్థానికులు తెలిపిన ప్రకారం.. నవీపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు నర్సయ్య(54), నర్సమ్మ దంపతులు ఇద్దరు కూతుళ్లకు పెండ్లిళ్లు చేశారు. నర్సయ్య మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసగా మారి తరచూ భార్యను కొడుతుండేవాడు. ఈనెల 3న మరోసారి భార్యను కొట్టడంతో కాలు విరిగింది. దీంతో ఆమె నిజామాబాద్లో ఉంటున్న పెద్ద కూతురు వద్దకు వెళ్లింది.
కొత్తపేటలో ఉండే చిన్న కూతురు మమత సోమవారం ధర్మారం వెళ్లి, అమ్మని ఎందుకు కొట్టావని తండ్రిని ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. మద్యం మత్తులో పడుకుని ఉన్న తండ్రి తలపైన రోకలి బండతో మమత కొట్టడడంతో చనిపోయాడు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్న కొడుకు గంగారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.