- ప్రభుత్వానికి లీగల్ నోటీసులు
బోధన్, వెలుగు: నిజామాబాద్జిల్లా బోధన్లోని చారిత్రాక ఇంద్ర నారాయణ స్వామి(వంద స్తంభాల) గుడిని వెంటనే పునరుద్ధరించి, భక్తులు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ఛత్రపతి యువజన సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అడ్లూరి శ్రీనివాస్ తెలిపారు. శనివారం బోధన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన వంద స్తంభాల గుడిని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
ఆలయ పురాతన శిల్పకళ, శిలా సంపద, నిర్మాణ అవశేషాలను సంరక్షించాలని.. శాస్త్రీయ పద్ధతుల్లో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆలయానికి 1.20 ఎకరాల స్థలం ఉందని, ఆక్రమణలకు తావులేకుండా పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై గత నెల 21న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, పురావస్తు శాఖ డైరెక్టర్, దేవాదాయ శాఖ కార్యదర్శి, కలెక్టర్, బోధన్ ఆర్డీవో, ఎమ్మార్వో , మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులకు లీగల్ నోటీసులు అందజేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ప్రెస్మీట్లో ఛత్రపతి యువజన సంఘం సంఘం నాయకులు ధర్మపురి, అశోక్ గౌడ్, గోపి కిషన్, రాజులదేవి పవన్, పెర్కా వెంకటేష్, కందికట్ల వాసు, దుర్గా ప్రసాద్, గౌతమ్, భూమేశ్, నిమ్మ శ్రీనివాస్, శివరాజ్, శ్రీకాంత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
