
మెదక్, వెలుగు: అక్రమంగా యూరియాను తరలిస్తున్న డీసీఏం వ్యాన్ ను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణమూర్తి సిబ్బందితో కలిసి 161 నంబర్ నేషనల్ హైవే మీద టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి చౌరస్తా వద్ద అక్రమంగా యూరియాను రవాణా చేస్తున్న డీసీఎం వ్యాన్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఆ వాహనంలో మొత్తం 250 యూరియా బస్తాలు ఉండగా వాహనాన్ని టేక్మాల్ పీఎస్కు తరలించి కేసు నమోదు చేశారు. ఆ యూరియా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతోంది. ఎవరు తరలిస్తున్నారు అన్నది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.