డీఈఈ సెట్​లో 78%  మంది క్వాలిఫై

డీఈఈ సెట్​లో 78%  మంది క్వాలిఫై
  •     ఈ నెల 9 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ

 హైదరాబాద్, వెలుగు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్–2025 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తం 78.18% మంది క్వాలిఫై అయ్యారు. ఈ మేరకు గురువారం డీఈఈసెట్ కన్వీనర్ జి. రమేష్ ఫలితాలను విడుదల చేశారు. గతనెల 25న డీఈఈసెట్ పరీక్ష జరిగింది.

దీనికి 46,615 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 33,821 మంది అటెండ్ అయ్యారు. వారిలో 26,442 మంది (78.18%) క్వాలిఫై అయ్యారు. తెలుగుమీడియం అభ్యర్థులు 15,476 మంది పరీక్ష రాయగా, వారిలో 11,266 మంది అర్హత సాధించారు. ఇంగ్లిష్ మీడియంలో 16,963 మంది ఎగ్జామ్ రాయగా, వారిలో 14,646 మంది, ఉర్దూమీడియంలో 1,382 మందికి 530 మంది క్వాలిఫై అయ్యారు.

కాగా, ఇంగ్లిష్ మీడియంలో సిద్దిపేట జిల్లాకు చెందిన పసునూరి అభినవరెడ్డి (87మార్కులు), తెలుగు మీడియంలో నిర్మల్ జిల్లాకు చెందిన తక్కలపల్లి హరిక (77 మార్కులు), నిర్మల్ జిల్లాకు చెందిన ఫరాజ్ అహ్మద్ (67 మార్కులు) టాపర్లుగా నిలిచారు. 

9 నుంచి కౌన్సెలింగ్

డీఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 9 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 9 నుంచి13 వరకు రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన వారంతా ఈ నెల 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.