రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా వైరస్

రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా వైరస్

న్యూఢిల్లీ: రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో డిఫెన్స్ మినిస్ట్రీలో భారీ సంఖ్యలో కాంటాక్ట్స్ ట్రేసింగ్ ప్రారంభించినట్లు అధికార వర్గాలు గురువారం మీడియాకు వెల్లడించాయి. కుమార్ పరిస్థితి స్థిరంగా ఉందని, ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారని తెలిపాయి. రైసినా హిల్స్ సౌత్ బ్లాక్‌లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కనీసం 35 మంది అధికారుల నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని హోం క్వారంటైన్ చేసినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయానికి హాజరు కాలేదని తెలిసింది. రక్షణ మంత్రి, రక్షణ కార్యదర్శి, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ కార్యాలయాలు సౌత్ బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్నాయి. సౌత్ బ్లాక్ లోని అన్ని కార్యాలయాను శానిటైజ్ చేశామని, కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్నట్లు అధికారులు చెప్పారు.