
ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి హాఫ్ సెంచరీ చేయగా..ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ చిచ్చరపిడుగులా చెలరేగాడు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా, వార్నర్ శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్కు 3.4 ఓవర్లలోనే 33 పరుగులు జోడించారు. అయితే 15 పరుగులు చేసిన పృథ్వీ షా హృతీక్ షోకీన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే ఫోర్లతో రెచ్చిపోయాడు. కేవలం 18 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు సాధించి పీయూష్ చావ్లా బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన యశ్ దుల్ (2) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఆ వెంటనే పావెల్ ను చావ్లా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం వచ్చిన లలిత్ యాదవ్ 2 పరుగులే చేసి పెవలియన్ చేరడంతో ఢిల్లీ 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
దుమ్మురేపి అక్షర్ పటేల్.. వార్నర్ వీరవిహారం..
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు ,ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 22 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సులతో హాఫ్ సెంచరీ చేశాడు. అటు కెప్టెన్ వార్నర్ కూడా 43 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 66 పరుగులు జోడించారు. అయితే 25 బంతుల్లో 54 పరుగులు చేసిన అక్షర్ పటేల్ బెహ్రెండోర్ఫ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ వెంటనే వార్నర్ కూడా బెహ్రెండోర్ఫ్ బౌలింగ్లోనే పెవీలియన్ చేరాడు.
టపా టాపా..
వీరిద్దరు ఔటయ్యాక ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పేకమేడను తలపించింది. ఆ తర్వాత వచ్చిన అభిషేక్ పోరెల్ (1) త్వరగానే పెవీలియన్ చేరగా.. కుల్దీప్ యాదవ్ డకౌట్ అయ్యాడు. అనంతరం నోర్ట్జే 5 పరుగులు చేసి ఔటవడంతో..ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, బెహ్రెండోర్ఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. రిలే మెర్డిత్ రెండు వికెట్లు, హృతిక్ షోకీన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.