
న్యూఢిల్లీ: వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు ఐపీఎల్లో బోణీ చేసింది. ఛేజింగ్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (41 బాల్స్లో 11 ఫోర్లతో 57) రాణించడంతో.. గురువారం జరిగిన మ్యాచ్లో డీసీ 4 వికెట్ల తేడాతో కోల్కతా పై నెగ్గింది. వర్షం వల్ల ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 127 రన్స్కు ఆలౌటైంది.
జేసన్ రాయ్ (39 బాల్స్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 43), రసెల్ (31 బాల్స్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 38) మినహా మిగతా వారు నిరాశపర్చారు. గత మ్యాచ్ల్లో నిరాశపర్చిన ఢిల్లీ బౌలర్లు ఈసారి మాత్రం అద్భుతం చేశారు. పేసర్ ఇషాంత్ శర్మ (2/19)తో పాటు అన్రిచ్ (2/20), అక్షర్ పటేల్ (2/13), కుల్దీప్ (2/15) అంచనాలను అందుకున్నారు.
ఓపెనింగ్లో రాయ్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్లో లిటన్ దాస్ (4), వెంకటేశ్ అయ్యర్ (0), నితీష్ రాణా (4), మన్దీప్ సింగ్ (12), రింకూ సింగ్ (6), సునీల్ నరైన్ (4) ఘోరంగా ఫెయిలయ్యారు. దీంతో నైట్రైడర్స్ 70 రన్స్కే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రసెల్, రాయ్ ఏడో వికెట్కు 23 రన్స్ జత చేశారు. చివర్లో అనుకూల్ రాయ్ (0), ఉమేశ్ (3), వరుణ్ (1) నిరాశపర్చారు.
వార్నర్ ఒక్కడే..
తర్వాత ఢిల్లీ 19.2 ఓవర్లలో 128/6 స్కోరు చేసి గెలిచింది. ఓ ఎండ్లో పాతుకుపోయిన వార్నర్ బౌండ్రీలతో హోరెత్తించాడు. ఐదో ఓవర్లో పృథ్వీ షా (13) ఔట్కావడంతో తొలి వికెట్కు 38 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. పవర్ప్లేలో డీసీ 61/1 స్కోరు చేసింది. అయితే షా ఔటైన వెంటనే వరుస విరామాల్లో మిచెల్ మార్ష్ (2), ఫిల్ సాల్ట్ (5) కూడా పెవిలియన్కు చేరడంతో డీసీ 67/3తో ఎదురీత మొదలుపెట్టింది.
ఈ దశలో మనీష్ పాండే (21) అండతో వార్నర్ జోరు కొనసాగించాడు. నాలుగో వికెట్కు 26 రన్స్ జత చేసి 14వ ఓవర్లో వెనుదిరిగాడు. ఈ టైమ్లో అక్షర్ పటేల్ (19 నాటౌట్) నిలకడగా ఆడినా, వరుస ఓవర్లలో మనీష్, హమన్ హకీమ్ (0) ఔట్కావడంతో డీసీ కష్టాల్లో పడింది. చివర్లో లలిత్ యాదవ్ (4 నాటౌట్) అండతో అక్షర్ గెలిపించాడు.