ఢిల్లీ : చైనా మాంజా.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గాలి పటాలు ఎగరవేసేందుకు ఉపయోగించే చైనా మాంజాలు అత్యంత ప్రమాదకరమని.. ఈ మాంజాలపై బ్యాన్ ఉన్నప్పటికీ పలుచోట్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చైనా మాంజాలతో ఇప్పటికే చాలా ప్రమాదాలు జరుగగా.. ఇప్పుడు మరోసారి వ్యక్తి మరణించాడు.
వివరాలు… ఢిల్లీలోని బుద్ధ విహార్కు చెందిన మానవ్ శర్మ(28) సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. గురువారం రక్షాబంధన్ సందర్భంగా ఇద్దరు చెల్లెళ్లు అతడికి రాఖీ కట్టారు. ముగ్గురూ కలిసి స్కూటర్ మీద చిన్నమ్మ ఇంటికి బయల్దేరారు. పశ్చిమ విహార్ ఫ్లైఓవర్పైకి చేరగానే ఓ గాలి పటానికి ఉన్న మాంజా దారం మానవ్ మెడను చుట్టుకొంది. క్షణాల్లోనే అతడి గొంతును చీల్చివేసింది. దీంతో ముగ్గురూ కిందపడిపోయారు.
ఈ క్రమంలో ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్న ఇతర ప్రయాణీకులు వారిని ఆస్పత్రికి తరలించారు. మానవ్ దారి మధ్యలోనే మరణించగా.. అతడి చెల్లెళ్లు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మానవ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రమాదకరమైన చైనా మాంజాను సుప్రీం బ్యాన్ చేసినప్పటికీ.. పూర్తి స్థాయిలో నిషేదించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
మానవ్ శర్మ ఫైల్ ఫొటో..