
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ప్రియురాలిని చంపి… మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన జిమ్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేయసితో పాటు క్యాబ్ డ్రైవర్ను కూడా కాల్చిచంపాడు.
ఢిల్లీలో లేటెస్ట్ టెక్నాలజీతో జిమ్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు హేమంత్ లంబా అనే వ్యక్తి . దానికి అతనే కోచ్ గా పని చేస్తున్నాడు. అతనికి రాజస్థాన్కు చెందిన 22 ఏళ్ల యువతి దీప్తి గోయల్ తో పరిచయం ఏర్పడింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో తన బంధువుల దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలోనే హేమంత్తో ప్రేమలో పడింది దీప్తి. ఈ క్రమంలో డిసెంబరు 7వ తేదీన హర్యానాలోని రేవారికి ఆ యువతిని తీసుకువెళ్లిన హేమంత్.. ఆమెపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశాడు.తర్వాత బాధితురాలి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి అక్కడే పడేశాడు. ఆ తర్వాత ఓ క్యాబ్ బుక్ చేసుకుని… తనను జైపూర్ తీసుకువెళ్లాల్సిందిగా డ్రైవర్ను కోరాడు. అయితే డ్రైవర్ ఇందుకు నిరాకరించడంతో.. అతడిని కూడా తుపాకీతో కాల్చి చంపాడు.
ఆ తర్వాత అదే కారులో గుజరాత్లోని వల్సాద్ ప్రాంతానికి పారిపోయాడు. అక్కడే కారును అమ్మేందుకు ప్రయత్నించగా.. కారు డీలర్కు హేమంత్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో… క్యాబ్పై ఉన్న ఓ ఫోన్ నెంబరుకు కాల్ చేశాడు. దీంతో డ్రైవర్ భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది. తన భర్త కనిపించడం లేదని అతడికి చెప్పింది. దీంతో ఆ కారు డీలర్ పోలీసులకు సమాచారమివ్వగా.. అసలు విషయం బయటపడింది.
హేమంత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైనశైలిలో విచారణ జరుపగా నేరాన్ని అంగీకరించాడు. రెండు హత్యా నేరాల కింద హేమంత్ను అరెస్టు చేశారు. అయితే.. ప్రియురాలిని హత్య చేయడానికి గల కారణాలు తెలియలేదు.