సునందా పుష్కర్ మృతి కేసు : శశిథరూర్‌కు కోర్టు నోటీసులు

సునందా పుష్కర్ మృతి కేసు : శశిథరూర్‌కు కోర్టు నోటీసులు

సునందా పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ  కేసులో శశిథరూర్‌కు ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత ఢిల్లీ పోలీసులు తీర్పుపై రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ ఆలస్యానికి క్షమించాలని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి అప్పీల్‌ చేసుకున్నారు. ఈ అప్పీల్‌ను పరిశీలించిన కోర్టు.. తాజాగా శశిథరూర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ పిటిషన్‌ కాపీని మాత్రం తమకు పంపలేదని థరూర్‌ కౌన్సిల్‌ కోర్టుకు తెలియజేసింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు మెయిల్‌ ఐడీకి పిటిషన్‌ కాపీ పంపించారని పేర్కొంది. దీంతో కాపీని వెంటనే థరూర్‌కు పంపించాలని న్యాయమూర్తి జస్టిస్‌ డీకే శర్మ.. ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అంతేగాక, కేసుకు సంబంధించిన పత్రాలను వ్యాజ్యదారులకు మినహా వేరే వ్యక్తులకు పంపించొద్దని గట్టిగా సూచించారు. ఈ కేసు విచారణను 2023, ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు.

2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్ లో సునందా పుష్కర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మొదట ఇది హత్య అన్న కోణంలో దర్యాప్తు సాగినా.. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అయితే సునంద ఆత్మహత్య చేసుకునేలా థరూర్‌ ప్రేరేపించారన్నవి ఆయనపై అభియోగాలు రావడంతో ఆయనను ప్రధాన నిందితుడిగా చేర్చారు. దీంతో ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా... ఈ కేసుపై విచారణ జరిపిన పాటియాలా హౌస్‌ కోర్టు.. 2021 ఆగస్టులో శశిథరూర్‌పై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.