27వారాల గర్భవిచ్చిత్తికి అనుమతి.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

27వారాల గర్భవిచ్చిత్తికి అనుమతి.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం వచ్చే గర్భాన్ని మహిళ 27వ వారంలోనూ అబార్షన్ చేయించుకునేందుకు అనుమతిచ్చింది. ఇటీవల తనకు గర్భం వద్దని కోర్టును సంప్రదించిన మహిళ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు.. భర్త మరణించిన తర్వాత తనకు తీవ్ర మానసిక సమస్యలు మొదలయ్యాయని తెలిపింది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. తాజాగా ఆమె 27వారాల గర్భవిచ్చిత్తికి అనుమతిస్తున్నట్టు జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తీర్పు వెల్లడించారు. 27వారాలు దాటినప్పటికీ ఆ మహిళకు అబార్షన్ చేయాలని కోర్టు ఎయిమ్స్ ఆస్పత్రిని కోరింది.

పిటిషన్ దాఖలు చేసిన మహిళ ఒక వితంతువని ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. భర్తను కోల్పోయిన ఆమె తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతోంది. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనందున ఆమె గర్భంతో ఉంటే తనకు తాను హాని చేసుకునే అవకాశముందని పలు నివేదికలు సూచించినందున కోర్టు.. ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించింది.

ఇలాంటి ఘటనే గతంలో ముంబయిలో జరిగింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడిన ఓ మహిళ 27 వారాల గర్భవిచ్ఛిత్తికి బాంబే హైకోర్టు గతంలో అనుమతించింది. కోర్టు ఆదేశాలతో ముంబయిలోని పరేల్‌ కేఈఎం ఆస్పత్రి వైద్యులు ఆగస్టు 8న అత్యవసర అబార్షన్ నిర్వహించగా.. శిశువు సజీవంగా జన్మించింది.