- సీఓఏ చేతుల్లోకి ఐఓఏ
- ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు
న్యూఢిల్లీ: ఏఐఎఫ్ఎఫ్పై ఫిఫా బ్యాన్ విధించిన రోజునే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) బాధ్యతలను ముగ్గురు సభ్యులతో కూడిన పరిపాలకుల కమిటీ (సీఓఏ)కి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ను అమలు చేసేందుకు ఐఓఏ అంగీకరించకపోవడంతో సంఘం పర్యవేక్షణకు సీఏఓను నియమిస్తున్నట్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
ఇకపై ఒలింపిక్ సంఘాన్ని సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ అనిల్ ఆర్. దవే, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషి, విదేశీ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి స్వరూప్లతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపింది. సంఘం బాధ్యతలను సీఓఏకు అప్పగించాలని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని కోర్టు ఆదేశించింది.
సీఓఏకు ముగ్గురు ప్రముఖ క్రీడాకారులు (అభినవ్ బింద్రా, ఆంజూ జార్జ్, బొంబ్యాల దేవి) సహాయం చేస్తారని చెప్పింది. కాగా, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఐఓఏ భావిస్తోంది.