న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకోకుండానే సభ వాయిదా పడింది. పది మంది నామినేటెడ్ సభ్యుల ప్రమాణ స్వీకారం టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసన తెలిపారు. దీంతో బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల కౌన్సిలర్లు ఒకరినొకరు తోసుకునేదాకా వెళ్లింది. ఈ నిరసనల మధ్యే నలుగురు నామినేటెడ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంత చెప్పినా ఆప్ సభ్యులు వినకపోవడంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్యశర్మ (బీజేపీ) సభను గంటపాటు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత ప్రమాణ స్వీకారం కోసం నామినేటెడ్ సభ్యుడు మనోజ్ కుమార్ను స్టేజీపైకి పిలవగానే.. ఆప్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు మళ్లీ నిరసనకు దిగారు. గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సభ్యుడిని కాకుండా.. వేరొక సభ్యుడిని ప్రిసైడింగ్ స్పీకర్గా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించారంటూ ఆప్ కౌన్సిలర్లు మండిపడ్డారు. ముందుగా తమ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించాలంటూ టేబుల్స్పై నిలబడి నిరసన తెలిపారు.
బీజేపీవి నీచ రాజకీయాలు: ఆప్
నామినేటెడ్ సభ్యులు ఎన్నడూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ హౌస్లో ఓటేయలేదని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. స్టాండింగ్ కమిటీ సభ్యులను కూడా ఓటింగ్కు అనుమతించలేదంటూ మండిపడ్డారు. హౌస్లో తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ నీచ రాజకీయాలకు దిగుతున్నదని విమర్శించారు. సభలో ఆప్ కౌన్సిలర్లు గందరగోళం సృష్టిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికలంటే ఆప్ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఇక బీజేపీ కౌన్సిలర్లు ఆప్తో పాటు పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్యశర్మ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో మరో తేదీని ప్రకటించి మిగిలిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాక మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటామని తెలిపారు.
మా మహిళా కౌన్సిలర్లపై దాడి చేసిన్రు: బీజేపీ ఎంపీలు
బీజేపీ మహిళా కౌన్సిలర్లపై ఆప్ మేల్ కౌన్సిలర్లు దాడి చేశారని పార్టీ ఎంపీలు మీనాక్షి లేఖి, మనోజ్ తివారి, పర్వేశ్ వర్మలు ఆరోపించారు. వీరంతా కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ దాడిలో ఏడుగురు బీజేపీ కౌన్సిలర్లకు గాయాలయ్యాయన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను ఆప్ కౌన్సిలర్లు అడ్డుకున్నారని విమర్శించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రొసీడింగ్స్ ప్రారంభించగానే ఆప్ నేతలు గొడవ షురూ చేశారని తెలిపారు. బీజేపీ కౌన్సిలర్లు ఇందర్ కౌర్, అనితతో ఆప్ కౌన్సిలర్లు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌర్ జుట్టు పట్టుకొని లాగారని, పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె వేలికి గాయమైందని తెలిపారు. అనితకు కూడా గాయం కావడంతో కౌర్ ఆమెను సేవ్ చేసిందన్నారు. కొందరు ఆప్ కౌన్సిలర్లు లిక్కర్ తాగి వచ్చారని ఆరోపించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఎంసీడీ సభలో ఇదొ బ్లాక్ డే అని విమర్శించారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న బీజేపీ మహిళా కౌన్సిలర్లను ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవ్ పరామర్శించారు. ఆప్ కౌన్సిలర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.