- హెచ్డీఎఫ్సీ సీఈఓ కేకి మిస్త్రీ
బిజినెస్ డెస్క్, వెలుగు: రియల్ ఎస్టేట్ సెక్టార్ స్ట్రాంగ్గా ఉందని, హోమ్ లోన్స్కు డిమాండ్ పెరుగుతోందని హెచ్డీఎఫ్సీ సీఈఓ కేకి మిస్త్రీ పేర్కొన్నారు. కిందటేడాది యావరేజ్ లోన్ సైజు రూ.27 లక్షలు ఉండగా, ఈ ఏడాది రూ. 32.3 లక్షలకు పెరిగిందని, దీన్నిబట్టి మెట్రో సిటీలలో ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోందని ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లో..
ప్రశ్న: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల అవుట్ లుక్ ఎలా ఉంది? రియల్టీ సెక్టార్లో డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి?
కేకి మిస్త్రీ: 2017 చివరి నుంచి 2020 వరకు చూసుకుంటే హైదరాబాద్, ముంబై వంటి మెట్రో సిటీలలో హౌసింగ్ డిమాండ్ ఫ్లాట్గా ఉందని చెప్పాలి. ఈ పిరియడ్లో కూడా టైర్ 2, 3 సిటీలలో గ్రోత్ కనిపించింది. తర్వాత కోవిడ్ రావడం, ఇతరత్రా కారణాలతో 2020 చివరి ఆరు నెలల్లో మెట్రో సిటీలలోనూ డిమాండ్ పుంజుకోవడం చూశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. బలమైన గ్రోత్ కనిపిస్తోంది. సెకెండ్ వేవ్ ప్రభావం తక్కువగా ఉంది. థర్డ్వేవ్ ప్రభావం పెద్దగా లేదు. గత మూడు నాలుగేళ్లను గమనిస్తే ఇండ్లు అఫోర్డబుల్గా మారాయి. మెట్రోసిటీలలో ప్రాపర్టీ రేట్లు పెద్దగా పెరగలేదు. కానీ, ప్రజలు ఆదాయాలు పెరిగాయి.
ప్రశ్న: ఇండివిడ్యువల్, నాన్ ఇండివిడ్యువల్ లోన్స్కు సంబంధించి అసెట్ క్వాలిటీ ఎలా ఉంది? అధాన్న పరిస్థితులను దాటామని అనుకోవచ్చా?
కేకి మిస్త్రీ: వ్యవస్థలో అధ్వాన్న పరిస్థితులను దాటేశామని కాన్ఫిడెంట్గా చెప్పగలను. మొత్తం బ్యాంకింగ్ సెక్టార్లో లోన్ కలెక్షన్లు మెరుగుపడుతున్నాయి. కరోనా మొదటి, రెండో వేవ్ టైమ్లలో లోన్ కలెక్షన్లపై నెగెటివ్ ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఇలాంటి టైమ్లో సరియైన నిర్ణయాలు తీసుకున్నందుకు ఆర్బీఐని మెచ్చుకోవాలి. వడ్డీ రేట్లను తగ్గించడం, వ్యవస్థలోని ప్రతీ సెగ్మెంట్కు మనీ అందుబాటులో ఉండేలా చేయడం, లోన్ రీస్ట్రక్చరింగ్ ద్వారా బారోవర్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడడం, మధ్యతరగతి వారికి సాయపడేలా వివిధ చర్యలు తీసుకోవడంలో ఆర్బీఐ మంచి పనితీరు కనబరిచింది. అందుకే స్ట్రాంగ్గా రికవరీ అయ్యాం. కేవలం మా లోన్ కలెక్షన్లే కాకుండా మొత్తం బ్యాంకింగ్ సెక్టార్లో లోన్ కలెక్షన్లు పెరగడాన్ని చూడొచ్చు. బారోవర్ మూడు నెలల ఈఎంఐ కట్టకపోతే ఆ లోన్ను నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా చూస్తాం. దీనర్ధం ఆ లోన్ రిస్క్ అనీ కాదు, అలాగని రైటాఫ్ చేయాలనీ కాదు. ఎందుకంటే లోన్ను వేటిపై ఇచ్చామో, వాటి వాల్యూ ఎప్పుడూ బాగానే ఉంటుంది.
ప్రశ్న: ఏయే ఏరియాలలో గ్రోత్ ఎక్కువగా కనిపిస్తోంది?
కేకి మిస్త్రీ: అన్ని ఏరియాలలో గ్రోత్ కనిపిస్తోంది. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పుణె, జైపూర్లలో గ్రోత్ ఎక్కువగా ఉంది. టైర్ 2, 3 సిటీలను పరిగణిస్తే, దేశంలోని వివిధ సిటీలలో గ్రోత్ కనిపిస్తోంది. నార్త్, వెస్ట్, సౌత్ ఇండియాలలో గ్రోత్ ఎక్కువగా ఉంది. ఈస్ట్లో కొంచెం తక్కువగా ఉంది.
ప్రశ్న: యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. భవిష్యత్లో ఎలా ఉండొచ్చు?
కేకి మిస్త్రీ: అంచనాలకు అనుగుణంగానే రేట్ల పెంపు ఉంది. ఫెడ్ మీటింగ్ ముందు రోజు సర్వే చేసి ఉంటే 25 బేసిస్ పాయింట్ల పెంపు ఖచ్చితంగా ఉంటుందని చాలా మంది చెప్పేవారు. అసలైన విషయం ఏంటంటే, ఇక నుంచి ఇంకో ఆరు లేదా ఏడు సార్లు వడ్డీ రేట్లు పెంపు ఉంటుందా? 25 లేదా 50 బేసిస్ పాయింట్లు చొప్పున పెంచుతారా? అని. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ క్లియర్గా ఉంది. ఈ ఏడాది యూఎస్లో వడ్డీ రేట్లు 1.75 శాతం నుంచి 1.9 శాతం రేంజ్లో ఉండొచ్చు. వచ్చే ఏడాదిలో మరో మూడు సార్లు వడ్డీ రేట్లు పెంచితే, 2023 చివరి నాటికి వడ్డీ రేట్లు 2.5 శాతం నుంచి 4 శాతం మధ్యలో ఉంటాయి. కానీ, ఇవన్నీ ఇన్ఫ్లేషన్, ఆయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయి. యూఎస్ ఎకానమీపై ఫెడ్ కాన్ఫిడెంట్గా ఉంది. వడ్డీ రేట్లు పెరిగినా, ఎకానమీ గ్రోత్పై పెద్దగా ప్రభావం ఉండదని అంచనావేస్తోంది.