
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు మంచి రిటర్నులు ఇస్తుండడంతో పాటు, అకౌంట్ ఓపెన్ చేయడం మరింత ఈజీ కావడంతో ఆగస్టు నెలలో డీమ్యాట్ అకౌంట్లు 26 శాతం పెరిగి 12.7 కోట్లకు చేరాయి. జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో ఎక్కువ ఖాతాలు యాడ్ అయినట్లు డేటా చెబుతోంది. 2023 లో నెలకు సగటున 21 లక్షల డీమ్యాట్ అకౌంట్లు ఓపెనవుతుండగా, ఆగస్టు నెలలో ఈ సంఖ్యను దాటిపోయినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఎనాలిసిస్ వెల్లడించింది. కొత్త అకౌంట్ల ఓపెనింగ్ ఆగస్టు నెలలో 4.1 శాతం పెరిగి మొత్తంగా 31 లక్షల అకౌంట్లు యాడ్ అయినట్లు పేర్కొంది. అంతకు ముందు జులై 2023 నెలలో 30 లక్షల డీమ్యాట్ అకౌంట్లు కొత్తగా ఓపెన్ అయ్యాయి. రెండు డిపాజిటరీలు... ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ వద్ద ఆగస్టు నెలాఖరు నాటికి డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 12.7 కోట్లకు చేరినట్లు వివరించింది.
అంతకు ముందు ఏడాది అంటే ఆగస్టు 2022 చివరినాటికి ఈ డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10.1 కోట్లు మాత్రమే. 12.7 కోట్ల అకౌంట్లలో ఎన్ఎస్డీఎల్ వద్ద 3.3 కోట్లు, సీడీఎస్ఎల్ వద్ద 9.35 కోట్లు ఓపెన్ అయినట్లు సెబీ డేటా వెల్లడిస్తోంది. ఈక్విటీ మార్కెట్లు మంచి లాభాలు ఇస్తుండటంతోపాటు, బ్రోకర్లు అకౌంట్ ఓపెనింగ్ను సులభం చేయడం వల్లే డీమ్యాట్ అకౌంట్లు వేగంగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎన్ఎస్ఈలో యాక్టివ్ క్లయింట్లు గత రెండు నెలలుగా అధికమవుతున్నారు. ఆగస్టు నెలలో యాక్టివ్ యూజర్ క్లయింట్లు 2.5 శాతం పెరిగి 3.27 కోట్లకు చేరారు. టాప్ ఫైవ్ డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలు జెరోధా, ఏంజిల్వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్లు 60.8 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే ఈ అయిదుగురు బ్రోకర్ల వాటా కొద్దిగా తగ్గింది.