హిందువులు మెజార్టీగా ఉన్నన్ని రోజులే దేశంలో ప్రజాస్వామ్యం : కిషన్ రెడ్డి

హిందువులు మెజార్టీగా ఉన్నన్ని రోజులే దేశంలో ప్రజాస్వామ్యం : కిషన్ రెడ్డి
  •      మైనార్టీ అయితే అశాంతి నెలకొంటది 
  •     డీఎంఎఫ్ స్టాల్స్​ను ప్రారంభించిన కేంద్ర మంత్రి 

న్యూఢిల్లీ, వెలుగు: హిందువులు మెజారిటీగా ఉన్నన్ని రోజులే దేశంలో ప్రజాస్వామ్యం, సామరస్యపూర్వక వాతావరణం ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హిందువులు మైనార్టీ అయితే.. దేశంలో హింస, అశాంతి నెలకొంటుందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) స్టాల్స్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

 గనుల శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 645 జిల్లాల్లో డీఎంఎఫ్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రధాని ఆదేశాలతో.. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు బొగ్గు, ఇతర ఖనిజాల గనుల సీఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా.. గనులున్న ప్రాంతాల్లోని ప్రజల విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, నైపుణ్యత, స్వయం సహాయక బృందాలకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. 

దేశవ్యాప్తంగా డీఎంఎఫ్ ఆధ్వర్యంలో రూ.92వేల కోట్లకు పైగా నిధులున్నాయని, ఇందులో రూ.50,900 కోట్లను వెచ్చించి 3,29,945 ప్రాజెక్టులు చేపట్టినట్లు వివరించారు. ఇందులో 1,88,642 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మిగిలినవి ప్రాసెస్ లో ఉన్నాయన్నారు. స్వయం సహాయక బృందాల మహిళలను లఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పతి దీదీలుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా.. డీఎంఎఫ్ నిధుల ద్వారా స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించడం, రానున్న రోజుల్లో వీరికి ఆదాయ వనరులను సమకూర్చే లక్ష్యంతో డీఎంఎఫ్ స్టాల్ ప్రారంభించినట్లు తెలిపారు. 

రాహుల్ ది మిడిమిడి జ్ఞానం

రాహుల్ గాంధీది మిడిమిడి జ్ఞానం అని కిషన్ రెడ్డి అన్నారు. హిందువులపై విద్వేషపూరితంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హిందువులను కించపరిచేలా కామెంట్లు చేయడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

యూపీఎస్సీలో ప్రిలిమ్స్ క్లియర్​ చేసిన వారికి రూ.1లక్ష ప్రోత్సాహకం

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో 'నిర్మాణ్' పోర్టల్ ను ప్రారంభించారు. ఈ పోర్టల్ వెనుకబడిన వర్గాలకు చెందిన సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసేవారికి ఆసరాగా నిలవనుంది. సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి రూ.1 లక్ష ప్రోత్సాహకంగా అందించనున్నారు. ప్రధానమంత్రి ‘కర్మయోగి’ పథకం ప్రేరణతోనే ‘నిర్మాణ్(నోబుల్ ఇనిషియేటివ్ ఫర్ రివార్డింగ్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఆఫ్ నేషనల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్)' పోర్టల్ ను ప్రారంభించామని కిషన్ రెడ్డి తెలిపారు.