
కల్వకుర్తి, వెలుగు : బడీడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా టీచర్లు చర్యలు తీసుకోవాలని డీఈవో రమేశ్ కుమార్ సూచించారు. శుక్రవారం వెల్దండ, కల్వకుర్తి మండల కేంద్రాల్లో బడిబాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. ఈనెల 12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ అందజేయాలన్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని టీచర్లకు సూచించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్ బరపటి వెంకటయ్య, టెస్ట్ బుక్ మేనేజర్ మనపాడు నరసింహులు, ఎంఈవోలు శంకర్ నాయక్, చంద్రుడునాయక్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.