
- కేబినెట్ భేటీలో నివేదిక సమర్పిస్తం.. పరిష్కారం కనుగొంటాం
- ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని, గురువారం జరిగే కేబినెట్ భేటీలో సమగ్ర నివేదిక సమర్పించి సానుకూల పరిష్కారం కనుగొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో బుధవారం సెక్రటేరియెట్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల సబ్ కమిటీని, సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని సీఎం రేవంత్ రెడ్డి నియమించారని గుర్తుచేశారు. ఈ కమిటీలు ఉద్యోగ సంఘాలతో పలుమార్లు చర్చించి విజ్ఞప్తులను స్వీకరించాయని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి చెల్లించడం సాధ్యం కానప్పటికీ, ఉద్యోగుల సమస్యలను ఇకపై ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా పరిష్కరించాలనేది ప్రభుత్వ ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా.. ప్రభుత్వ ఆదాయం, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులకు మేలు చేయాలనే తపన తమ ప్రభుత్వానికి ఉందని తెలిపారు.
ఉద్యోగులకు రూ.11 వేల కోట్ల బిల్లులు పెండింగ్: జేఏసీ
ఉద్యోగులకు సంబంధించి రూ.11 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు. భట్టి విక్రమార్కతో సమావేశం అనంతరం ఏలూరు శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. కేబినెట్ సబ్ కమిటీ, ఆఫీసర్స్ సబ్ కమిటీ తో 120 మంది జేఏసీ నేతల మీటింగ్ జరిగిందని.. 300 డిమాండ్స్ పై చర్చించినట్లు తెలిపారు. డీఏలు ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు అంశం కూడా చర్చించినట్లు చెప్పారు.
సీఎస్ అధ్యక్షత న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఏడాదిన్నర నుంచి సర్పంచ్ లు లేక స్పెషల్ ఆఫీసర్లు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించినట్లు వివరించారు. రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై ఎలాంటి చర్చ లేదన్నారు.
మంత్రులెవరికీ భిన్నాభిప్రాయం లేదు
ఉద్యోగుల కుటుంబాల్లోని పెళ్లిళ్లు, ఆసుపత్రి ఖర్చుల వంటి అంశాలపైనా అంతర్గతంగా చర్చించామని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై తమ సహచర మంత్రులెవరికీ భిన్నాభిప్రాయం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలను కూడా కేబినెట్ సమావేశంలో వివరిస్తామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు భరోసా ఇచ్చారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ఉద్యోగుల జేఏసీ నాయకులు ఏలూరు శ్రీనివాస్రావు, సత్యనారాయణ, లచ్చిరెడ్డి, దామోదర్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి, కటకం రమేష్, సి.జగదీశ్, చావ రవి, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.