![పదేండ్లు సీఎంగా పనిచేసి.. దిగజారుడు మాటలేంది : భట్టి విక్రమార్క](https://static.v6velugu.com/uploads/2024/04/deputy-cm-bhatti-vikramarka-is-angry-with-kcr_1lRAkxEzpo.jpg)
- కేసీఆర్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం
- బీఆర్ఎస్ కట్టు కథలను ప్రజలు నమ్మరు
- అసెంబ్లీ ఓట్ల కోసం ముందే నీళ్లు వదిలి..
- ఇప్పుడు అక్కసుతో అబద్ధాలాడుతున్నడు
- రూ.7లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆగం చేసిండు
- గత బీఆర్ఎస్ పాలన, 3 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్
న్యూఢిల్లీ, వెలుగు : గత వానా కాలంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందని.. ప్రస్తుతం ఏ రిజర్వాయర్లో, ఏ కుంటలో నీళ్లు లేకపోయినా అది కేసీఆర్ పుణ్యమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాలువలో ముందే నీళ్లు పారించి కుంటల్లో తడి లేకుండా చేసిండు. నక్కల గండీ, ఎస్ ఎల్బీసీ, దిండి అలా పాడావ్ పడి ఉండడానికి కేసీఆరే కారణం.
ఇవన్నీ ఏడ బయటకు వస్తాయోనని అబద్ధాలు ఆడుతున్నడు. వాస్తవాలు ప్రజలకు తెలుసు. మా ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు అన్ని తెలిపేలా శ్వేతపత్రం రిలీజ్ చేశాం” అని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో వర్షం నీళ్లను కూడా సరిగా ఒడిసి పట్టుకోకుండా.. గాలికొదిలేశారని మండిపడ్డారు.
వాటిని సక్రమంగా ఒడిసి పట్టుకొని, రిజర్వాయర్లలో నిలుపుకొని ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ‘‘కేసీఆర్ దగ్గర సరైన వాటర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లే ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడ్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో చలికాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ జూన్ లో వర్షాలు పడితే.. వాటర్ ఎట్ల మెయింటనెన్స్ చేయాలి, ఎలా ఒడిసి పట్టుకోవాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది” అని చెప్పారు.
నువ్వు కట్టిన కాళేశ్వరంలో తోడనీకి నీళ్లేవి?
కాళేశ్వరంలో నీళ్లు తోడడం లేదంటూ కేసీఆర్ విమర్శిస్తున్నారని, అయితే వాళ్లు కట్టిన ఆ కాళేశ్వరంలో నీళ్లు ఎక్కుడున్నాయని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ లో పెండింగ్ లో ఉన్న 10 కి.మీ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు నల్గొండ సస్యశ్యామలం అయ్యేదన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏదీ సరిగ్గా చేయలేదని.. బీఆర్ఎస్ పాలన, మూడు నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. తాను ప్రస్తావించిన అంశాలపై కేసీఆర్ చర్చకు రావాలని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో భారీ అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశం చేసి కాళేశ్వరం, భద్రాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి పవర్ ప్లాంట్చేపట్టారని, అందులో కాళేశ్వరం కూలిపోగా, భద్రాద్రి ప్లాంట్ పనికిరాని భారమై, యాదాద్రి ప్లాంట్ పూర్తి కాకముందే తడిసి మోపెడైందని మండిపడ్డారు. కేసీఆర్ నాశనం చేసిన విద్యుత్, ఆర్థిక వ్యవస్థలను తాము గాడిన పెడుతున్నామని చెప్పారు. కాళేశ్వరంలో ఏం జరిగిందో దేశమంతా చూసిందన్నారు. కమీషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ చేపట్టారని, యాదాద్రి పవర్ ప్లాంట్ ది ఫెయిల్యూర్ డిజైన్ అని తెలిపారు.
సూర్యాపేటలో కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించారని, ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు. ‘‘కట్టుకథల్లో భాగంగా సూర్యాపేట మీటింగ్లో సొంతంగా జనరేటర్ పెట్టుకున్న కేసీఆర్.. జనరేటర్ లోపం వల్ల మైక్ కట్ అయితే కాంగ్రెస్ హయాంలో కరెంట్ పోయిందంటూ పచ్చి అబద్ధాలకు తెరలేపిండు” అని ఫైర్ అయ్యారు. ‘‘విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా, నీళ్లు, కాళేశ్వరం గురించి మాట్లాడిన మాటల్లో ఏ ఒక్క దానిపై కూడా వాస్తవాలు చెప్పకుండా కట్టుకథలు చెప్పి బయటపడేందుకు కేసీఆర్ ప్రయత్నించిండు.
ఆయన చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి రాష్ట్రంపై, రాష్ట్ర పాలనపై అక్కసుతో దుమ్మెత్తి పోసిండు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు గత కేసీఆర్ పాలనలోని పాపాలే కారణం. పదేండ్లు ఆయన పాలనను గాలికొదిలేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై పెను భారం పడింది. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యే కదా దీనిని కూడా నడపలేరా అంటూ మాపై కేసీఆర్ మాట్లాడం విడ్డూరంగా ఉంది. కట్టిన ఇల్లును కూల్చేసి పోయిందే ఆయన” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నడు
పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మరీ ఇంత దిగజారి మాట్లాడటం ఏమిటని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిలదీశారు. ‘‘కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. బీఆర్ఎస్ ఖాళీ అవడాన్ని జీర్ణించుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నడు” అని విమర్శించారు. పదేండ్ల కాలంలో కేసీఆర్ రూ.1,10,690 కోట్ల విద్యుత్తు బకాయిలు చేశారని, రూ.7లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆగం చేశారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయిస్తే తాము అన్నీ చక్కదిద్దుకుంటూ ముందు కెళ్తున్నామని తెలిపారు.
తెలంగాణకు ఎన్టీసీసీ ద్వారా 4 వేల మెగావాట్లు వచ్చేలా రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిరాని, కానీ కేసీఆర్ పాపం వల్లనే ఎన్టీపీసీ రాష్ట్రానికి రాలేదని అన్నారు. 2400 మెగావాట్ల పీపీఏ అగ్రిమెంట్లు చేసుకోకుండా కేసీఆర్ కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో నీటి, విద్యుత్ కష్టాలు లేకుండా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఏప్రిల్, మే నెలల్లోనూ సరిపడా విద్యుత్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. విద్యుత్ విషయంలో కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని , విద్యుత్ సరఫరా లేకుంటే వినియోగం ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం కంటే తామే ఎక్కువగా కరెంట్ ఇస్తున్నామని, గత మార్చి నెలలో 15,623మెగా వాట్ల విద్యుత్తు ఇచ్చినట్లు వివరించారు.
కట్టుకథలతో మభ్యపెట్టాలని కేసీఆర్ చూస్తున్నడు. సూర్యాపేట మీటింగ్లో సొంతంగా జనరేటర్ పెట్టుకొని.. జనరేటర్ లోపం వల్ల మైక్ కటైతే కాంగ్రెస్ హయాంలో కరెంట్ పోయిందంటూ పచ్చి అబద్ధాలకు తెరలేపిండు. బీఆర్ఎస్ ఖాళీ అవడాన్ని భరించలేక ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నడు. పదేండ్ల కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం దివాలా తీసింది. అన్నిటినీ సరిదిద్దుకుంటూ మేం ముందుకువెళ్తుంటే బురదజల్లుతున్నడు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క