
- గత నెల కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు వేసిన రైతులు
- భారీ వర్షాలు పడకపోవడంతో 50 శాతం కూడా మొలకెత్తలే!
- మరో మూడు, నాలుగు రోజుల్లో వానలు పడకుంటే పెట్టుబడి లాస్
ఈ రైతు పేరు బాలరాజు. నారాయణపేట జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లికి చెందిన ఇతడు తనకున్న రెండు ఎకరాలతో పాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని మే చివరి వారంలో పత్తి విత్తనాలు వేశాడు. ఇప్పటివరకు కౌలుకు రూ.80 వేలు, విత్తనాలు వేయడానికి కూలీలు, ఇతర ఖర్చులకు మరో రూ. 70 వేలు ఖర్చు చేశాడు. ఇటీవల వర్షాలు పడడంతో విత్తనాలు రెండు రోజులకే మొలకలు వచ్చి ఇంచున్నర మేర పెరిగాయి. పది రోజుల నుంచి వర్షం జాడ లేకపోవడం, బోరు వసతి లేకపోవడంతో మొక్కలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఇతడి పేరు కావలి మాసన్న. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన ఇతడు తన రెండు ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకొని మే 29న పత్తి విత్తనాలు వేశాడు. ఒక ప్యాకెట్ విత్తనాలను రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ. 20 వేలు ఖర్చు చేసి 20 ప్యాకెట్లు కొన్నాడు. జూన్ రెండో వారం ప్రారంభమైనా వానలు పడకపోవడంతో 25 శాతం మేర మాత్రమే మొలకలు వచ్చాయి. మొత్తం కలిపి ఇప్పటికే రూ.50 వేలు పెట్టుబడి పెట్టినట్లు రైతు తెలిపాడు. వర్షాలు లేకపోవడంతో మిగతా మొలకలు వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నాడు.
మహబూబ్నగర్, వెలుగు : ఈ సంవత్సరం మేలోనే ముందస్తుగా మురిపించిన వర్షాలు తర్వాత ముఖం చాటేశాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా, మృగశిర కార్తె వచ్చినా ఇప్పటివరకు ఒక్క భారీ వర్షం కూడా పడలేదు. రోహిణి కార్తెలోనే వానలు పడడంతో చాలా మంది రైతులు తమకున్న పొలంతో పాటు మరికొన్ని ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తిసాగు చేశారు. తర్వాత వర్షాలు పడకపోవడంతో ఆశించిన స్థాయిలో మొలకలు రాలేదు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు వర్షాలు పడకపోతే మరోసారి విత్తనాలు వేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంవత్సరం వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మే మొదటి వారంలో ఎండలు దంచి కొట్టగా.. రెండో వారంలో అడపాదడపా వర్షాలు పడ్డాయి. నాలుగో వారంలో రోహిణి కార్తెకు నాలుగైదు రోజుల ముందు నుంచే వర్షాలు పడ్డాయి. అప్పటికే వేసవి దుక్కులు పూర్తి చేసుకున్న రైతులు భూమిలో ఆశించిన మేర తేమ శాతం రాకపోయినా మే చివరి వారంలో పత్తి విత్తనాలను వేసుకున్నారు. అదే నెల చివర్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో వర్షాలు పడుతాయని అంతా భావించారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆఫీసర్లు కూడా ప్రకటించారు. కానీ నైరుతి రుతుపవనాలు వచ్చి, మృగశిర కార్తె మొదలైనా ఇంతవరకూ వాన జాడ లేదు. అప్పుడప్పుడు ఐదు, పది నిమిషాలు చిరుజల్లులు పడుతున్నాయే తప్ప భారీ వర్షం ఒక్కటి కూడా పడకపోవడంతో భూమిలో తేమ శాతం పెరగడం లేదు. దీంతో మే చివరి వారంలో పత్తి విత్తనాలు వేసుకున్న రైతుల పొలాల్లో మొలకలు రావడం లేదు. సమయానికి వానలు పడి ఉంటే ఇప్పటివరకే 90 శాతం వరకు మొలకలు వచ్చేవి.. కానీ వానలు పడకపోవడంతో 50 శాతం కూడా రాలేదు. మరో నాలుగైదు రోజుల్లో వర్షాలు పడకుంటే.. వచ్చిన మొలకలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది.
మూడేళ్లుగా పత్తికి అనుకూలించని వాతావరణం
రాష్ట్రంలో వరి తర్వాత మెజార్టీ ప్రాంతాల్లో పత్తి సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా.. ఇందులో ఉమ్మడి మహబూబ్నగర్లోనే 9 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ గత రెండు సీజన్లను పరిశీలిస్తే వాతావరణం పత్తి పంటకు అనుకూలించడం లేదు. 2023 మే చివరి వారంగానీ, జూన్ మొదటి వారంలో గానీ నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా ఆలస్యం అయ్యాయి. అప్పటికే మృగశిర కార్తె ప్రారంభంలో పత్తి విత్తనాలు విత్తుకోగా అవి మొలకెత్తలేదు.
ఆ సీజన్ మొత్తం తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి సాగుకు చేసిన రైతులు నష్టపోయారు. 2024లో ముందస్తు వర్షాలతో రైతులు మే చివరి వారంలోనే పత్తి విత్తనాలు విత్తుకోగా.. జూన్లో వర్షాలు ముఖం చాటేశాయి. బోర్లు ఉన్న రైతులు డ్రిప్ల ద్వారా మొక్కలను బతికించుకోగా.. నీటి వసతి లేని రైతులు అలాగే వదిలేశారు. ఆగస్ట్లో వానలు పుంజుకోవడంతో.. పొలాలను మళ్లీ దున్ని ఆ నెల చివరివారం నుంచి విత్తనాలను విత్తుకున్నారు. అయితే ఈ వానాకాలం సీజన్ కూడా గతేడాది పరిస్థితినే తలపిస్తోంది. మేలో కురిసిన వర్షాలు.. జూన్ ప్రారంభమైనా జాడ లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
60 మిల్లీమీటర్ల వాన పడితేనే విత్తనాలు వేయాలంటున్న ఆఫీసర్లు
పత్తి సాగు చేయాలనుకుంటున్న రైతులు మే మొదటి వారం నుంచే విత్తనాలను సిద్ధం చేసి పెట్టుకున్నారు. వేసవి దుక్కులు కూడా పూర్తి చేసుకున్నారు. కొద్దిపాటిగా వర్షాలు పడగానే భూమి పదునెక్కకముందే విత్తనాలు వేసుకున్నారు. అయితే 14 ఇంచుల (60 మిల్లీమీటర్ల) వర్షం పడితేనే విత్తనాలు వేసుకోవాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. ఐదారు ఇంచుల వర్షానికే విత్తనాలు వేసుకుంటే భూమి లోపలి నుంచి వచ్చే వేడికి మొలక శాతం తగ్గిపోతుందని చెబుతున్నారు.
ఎకరం పొలంలో 12 వేల మొక్కల నుంచి 14 వేల మొక్కలు ఉండాలని.. అందులో 90 శాతం మొక్కలు బతికితేనే మంచి లాభం ఉంటుందన్నారు. 50 శాతం మొక్కలే వస్తే నష్టాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. విత్తనాలు విత్తుకునేటప్పుడే అడుగు పిండి, డీఏపీ, పొటాశ్ లేదా కాంప్లెక్స్ ఎరువులు చల్లుకుంటే లాభం ఉంటుందని, విత్తనాలు విత్తుకున్న 15 రోజుల తర్వాత వీటిని చల్లుకుంటే మొక్క ఎదగదని చెబుతున్నారు.