- వర్షాలపై ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని పోలీసులకు డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వర్షాల ప్రభావిత ప్రాంతాల ఎస్పీలు, సీపీలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ సహా పోలీసులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరదల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో స్థానిక పరిస్థితుల గురించి డీజీపీ అడిగి తెలుసుకున్నారు.