మంత్రి కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం

మంత్రి కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎటుపోయినయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు అయినా.. హామీలు అమలు కాలేదని విమర్శించారు. ప్రస్తుతం ఐటీ రైడ్స్ కొనసాగుతున్నట్లు త్వరలోనే వేల కోట్ల స్కాంలలో మంత్రి కేటీఆర్ ఇరుకుతాడన్నారు. తప్పకుండా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 05వ తేదీన నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఏమి చేశారని ఇక్కడ పర్యటిస్తారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నిస్తూ.. ‘జనతా కో జవాబ్ దో’ అనే నినాదంతో బీజేపీ భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం నివాసాలు కట్టిస్తామని హామీనిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 9 ఏళ్లవుతున్నా.. ఇంతవరకు హామీని నెరవేర్చలేదన్నారు. వేరే రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3.20 లక్షల ఇండ్లు కట్టించారన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వాడుకుంటున్నారని.. కానీ ఇక్కడ వాడడం లేదన్నారు.

8 సంవత్సరాల వరకు ఆయుష్మాన్ భారత్ పెట్టలేదని, మొన్నటికి మొన్న ఈ పథకాన్ని పెట్టారని ఎంపీ అర్వింద్ విమర్శించారు. 9 ఏళ్లలో ఒక్క రోజు సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ కు రాలేదని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జహీరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు. పేదలకు ఇచ్చే బియ్యం పంపిణీ విషయంలో కలెక్టర్ ను ప్రశ్నించడం జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడిన ఘనత నిర్మలా సీతారామన్ కు దక్కుతుందన్నారు. కానీ.. ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. బియ్యానికి కేంద్రం రూ. 30 ఇవ్వడం లేదా ? అని ప్రశ్నించారు. 

ఈ హామీలు అమలయ్యాయా ? 
‘125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, నిజామాబాద్ లో బీడీ భవన్ ?, రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి ? నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఉచిత ఎరువులు, ఎకరంపల్లి ఎయిర్ పోర్టు, పోడు భూములు, కేజీ టు పీజీ విద్య, తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, నిరుద్యోగ భృతి, ప్రతి మండలానికి నలుగు డాక్టర్లతో పాటు 30 పడకల ఆసుపత్రి, మాధవినగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, లీటర్ పాలకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు.