ఒకేరోజు ఈ అరుదైన ఘనత: ఉత్తమ నటుడిగా బన్నీకి గద్దర్ అవార్డు.. మరోవైపు దర్శకుడు అట్లీకి డాక్టరేట్..

ఒకేరోజు ఈ అరుదైన ఘనత: ఉత్తమ నటుడిగా బన్నీకి గద్దర్ అవార్డు.. మరోవైపు దర్శకుడు అట్లీకి డాక్టరేట్..

ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తన కెరీర్‌లో మరో ఘనత సాధించారు. చెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ నుండి అట్లీ గౌరవ డాక్టరేట్ పొందారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. తాను చదువుకున్న యూనివర్సిటీ నుంచే అట్లీ ఈ గౌరవ డాక్టరేట్ అందుకోవడం విశేషం. 

2025 జూన్ 14న (శనివారం) జరిగిన సత్యభామ ఇన్స్టిట్యూట్ 34వ స్నాతకోత్సవ వేడుకలో ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ మరియాజీనా జాన్సన్, డైరెక్టర్‌ అట్లీకి గౌరవ డాక్టరేట్ సర్టిఫికేట్ మరియు స్మారక ఫలకాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా  డైరెక్టర్ అట్లీకి సినీ పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. దర్శకుడు అట్లీని అభినందించారు. ‘ గౌరవ డాక్టరేట్ అందుకున్న డైరెక్టర్ అట్లీ గారికి హృదయపూర్వక అభినందనలు. మీ అభిరుచి మరియు నైపుణ్యం ఈ స్థాయిలో జరుపుకోవడం చూసి నిజంగా సంతోషంగా ఉంది. మీరు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటున్నాను’ అని బన్నీ ట్వీట్ చేశారు.

అయితే, జూన్ 14న రోజే అల్లు అర్జున్ ‘పుష్ప 2’మూవీకిగానూ గద్దర్ అవార్డు అందుకున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. అల్లు అర్జున్‌కు అవార్డు అందజేశారు. మెమెంటో, ప్రశంసా పత్రంతోపాటు నగదు పురస్కారం అందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి సినిమా చేసే క్రమంలోనే ఇలా అత్యున్నతమైన అవార్డులు అందుకోవడం విశేషత సంతరించుకుంది.

స్నాతకోత్సవంలో అట్లీ మాట్లాడుతూ, క్యాంపస్‌లో విద్యార్థిగా ఉన్నప్పటి నుండి.. నేడు అత్యున్నత గౌరవం పొందే వరకు తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అట్లీ ఎమోషనల్ అయ్యారు. 

"ఒకప్పుడు నేను పెద్ద కలలతో విద్యార్థిగా అడుగుపెట్టిన అదే విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ పొందడం ఆనందంగా ఉంది. ఇక్కడే నేను నాపై బలమైన నమ్మకం, మరియు శక్తిని నేర్చుకున్నాను. నేను చిత్రనిర్మాత అయ్యే వరకు నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు. కానీ నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినది నా భార్య ప్రియా అట్లీ. నన్ను మంచి మనిషిగా తీర్చిదిద్దిన వ్యక్తి నా కొడుకు"  అని అట్లీ భావోద్వేగమైన స్పీచ్ ఇచ్చారు. 

భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా అట్లీ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఆయన తన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. 'రాజా రాణి'తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. తేరి, మెర్సల్, బిగిల్, జవాన్ వంటి సినిమాలతో తనదైన కథనంతో సామాజిక కోణాన్ని చూపించాడు. ప్రస్తుతం అట్లీ.. హీరో అల్లు అర్జున్ తో (AA22 వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తున్నాడు.