కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 2026 జూన్ 3న సాయంత్రం 4 గంటలకు లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి భారత రాజ్యాంగంతో వచ్చిన డీకే శివకుమార్.. రాజ్యాంగ ప్రతిని చేతపట్టి.. పూజ్య గురువు గంగాధర్ ఆజ్య పేరున ప్రమాణం చేశారు. దీంతో కర్ణాటకకు 34వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి కేహెచ్ మునియప్ప కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. సిద్ధరామయ్య తనయుడు యతీంద్రను కూడా కేబినెట్ లోకి తీసుకున్నారు డీకే.
ప్రమాణ స్వీకారానికి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సన్మానించారు డీకే శివకుమార్. అదే విధంగా మాజీ సీఎం సిద్ధరామయ్యను కూడా కండువాతో సన్మానించారు. అంతకు ముందు ఆధ్యాత్మిక మత గురువుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు డీకే.
సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారంతో.. గత కొంత కాలంగా కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చిత్తి తొలగినట్లయింది. గత రెండేళ్లుగా సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్న డీకేను ఇన్నాళ్లుగా ఓదార్చుతూ వస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఎట్టకేలకు సిద్ధరామయ్యను తప్పుకోవాల్సిందిగా.. జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించింది. అధిష్టానం ఆదేశాలతో సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో డీకేకు మార్గం సుగమం అయ్యింది.
