పెట్రో ధరలపై టెన్షన్​ వద్దు

పెట్రో ధరలపై టెన్షన్​ వద్దు

సరైన ధరలకే సప్లయ్​ జరిగేలా చూస్తున్నం: కేంద్రం
113 రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న ధరలు

న్యూఢిల్లీ:  రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, స్థిరమైన ధరలకే సప్లయ్​ జరిగేలా చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వ్యూహాత్మక నిల్వల నుంచి పెట్రోల్​, డీజిల్​ను విడుదల చేస్తున్నామని, ఫలితంగా ధరల సమస్య ఉండబోదని భరోసా ఇచ్చింది. రష్యా దాడుల తర్వాత గ్లోబల్ మార్కెట్​లో  క్రూడ్​ ధరలు బ్యారెల్​కు 100 డాలర్లకుపైగా పెరిగాయి. ప్రస్తుత ధరలు 93 డాలర్ల వద్ద ఉన్నాయి. యుద్ధం వల్ల చమురు సప్లయ్​కి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని, ఫలితంగా పెట్రో ధరలు పెరగొచ్చని ప్రచారం జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, జనానికి సరైన ధరలకే పెట్రోల్​, డీజిల్​ దొరికేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆందోళన అవసరం లేదని  కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దేశంలో గత 113 రోజులుగా పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరగలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. దీపావళి సమయంలో పెట్రోల్​, డీజిల్​పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్​ డ్యూటీని తగ్గించింది. కేంద్రం సూచనల మేరకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్​ను తగ్గించాయి.