
- కోర్టు పరిధిలో ఉన్న వివాదాల్లో జోక్యంపై అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్న వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న కర్మన్ఘాట్ తహసీల్దార్, మీర్పేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులకంటే అధికులమని మీరు భావిస్తున్నారా అంటూ నిలదీసింది. కోర్టు పెండింగ్లో ఉన్న వివాదంలో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించింది. హక్కులను నిర్ధారించడానికి మీరెవరని అడిగింది. శాతి భద్రతల పేరుతో కోర్టు వివాదంలో ఉన్న భూమికి సంబంధించి రెవెన్యూ అధికారుల నుంచి నివేదిక ఎలా అడుగుతారని పోలీసులపై సీరియస్ అయ్యింది.
రంగారెడ్డి జిల్లా కర్మన్ఘాట్లో సర్వే నం.60లో 400 చదరపు గజాల తన ప్లాట్ సర్వే నం.58లో ఉందంటూ తహసీల్దార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ బి.బుజ్జి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ప్లాట్ను చక్రధర్ అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నామని తెలిపారు.
అంతేగాకుండా సివిల్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు పొందామని వెల్లడించారు. పోలీసులు స్థలం గురించి రెవెన్యూ అధికారులకు లేఖ రాశారని, దీనిపై ఎమ్మార్వో స్పందిస్తూ పిటిషనర్కు చెందిన స్థలం సర్వే నం.58లో ఉందంటూ ప్రొసీడింగ్స్ జారీ చేశారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రెవెన్యూ, పోలీసు అధికారులు పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పిటిషనర్కు చెందిన ప్లాట్పై తహసీల్దార్ ఇచ్చిన నివేదికను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.