- ఆర్మ్డ్ ఫోర్సెస్ కు రక్షణ మంత్రి సూచన
- చీఫ్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ
న్యూఢిల్లీ: ‘కరోనా మహమ్మారితో దేశం మొత్తం పోరాడుతోంది.. ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. దీనిని అవకాశంగా తీసుకొని శత్రువులు రెచ్చిపోవచ్చు. వారికి ఆ ఛాన్సివ్వద్దు. అలర్ట్గా ఉండండి’ అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భద్రతా దళాలకు సూచించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లతో పాటు ఇతర ముఖ్య అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి భేటీ అయ్యారు. బోర్డర్లో పరిస్థితులను, తీసుకుంటున్న జాగ్రత్తలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. జమ్ము–కశ్మీర్తోపాటు చైనా సరిహద్దుల వెంబడి నెలకొన్న పరిస్థితులను అధికారులు వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై మిలటరీ కమాండర్ల నుంచి మంత్రి సూచనలు, సలహాలు కోరారు. ఈ మీటింగ్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె, చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ అడ్మిరల్ కరమ్బిర్ సింగ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్, సెక్రటరీ డిఫెన్స్(ఫైనాన్స్) గర్గి కౌల్ తదితరులు పాల్గొన్నారు.