- మంత్రి పొంగులేటి హామీ
మల్కాజిగిరి, వెలుగు: చర్లపల్లి ఐజీకే కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న పాత సింగిల్ బెడ్రూమ్ ఇండ్ల స్థానంలో ఆధునిక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. సచివాలయంలో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ నేతృత్వంలోని కాలనీ ప్రతినిధి బృందం మంగళవారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
సుమారు 1,200 కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విన్న మంత్రి.. పెండింగ్లో ఉన్న గృహ పట్టాల సమస్యను పరిష్కరించి పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 11 ఎకరాల స్థలంలో పార్కులు, డ్రైనేజీ, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలతో ఐజికే కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

