సౌతాంప్టన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. తక్కువ స్కోర్ కే కీలక వికెట్లను తీశారు. ప్రారంభంలోనే 2 వికెట్లు తీసి సఫారీలకు షాక్ ఇచ్చాడు బుమ్రా. దీంతో సౌతాఫ్రికా కొద్దిసేపు నిలకడగా ఆడింది. భారీ షాట్లకు ప్రయత్నించకుండా ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. డుప్లెసిస్, వాన్ డర్ డుస్సెన్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11 ఓవర్ల నుంచి హార్దిక్ పాండ్య, చాహల్, కుల్దీప్లతో విరాట్ కోహ్లీ బౌలింగ్ వేయించాడు. బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడకపోగా.. వికెట్ కాపాడుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
అయితే చాహల్ వేసిన 20వ ఓవర్ మొదటి బాల్ ని డుస్సెన్(22) రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించి బౌల్డ్ అయ్యాడు. క్రీజులో పాతుకుపోయిన డుప్లెసిస్(8) కూడా అదే ఓవర్ లాస్ట్ బాల్ కి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్ లో కుల్దీప్ మరో వికెట్ తీయడంతో పీకల్లతో కష్టాల్లో పడింది సౌతాప్రికా. 25 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 103 రన్స్ చేసింది. మిల్లర్(14), ఫెలుక్వాయో (7) క్రీజులో ఉన్నారు.