తాగునీళ్లకు అరిగోస..దాహం తీర్చని మిషన్​ భగీరథ

తాగునీళ్లకు అరిగోస..దాహం తీర్చని మిషన్​ భగీరథ
  • పట్టణాల శివారు ప్రాంతాల్లో తప్పని ఇబ్బందులు
  • గ్రామాల్లోనూ  పైపులైన్​, ఇతర సమస్యలతో సప్లై బంద్​
  • నీటి సమస్యే లేదంటున్న ఆఫీసర్లు

మహబూబాబాద్, వెలుగు : ఏప్రిల్​లోనే ఎండలు దంచుతున్నాయి. మిషన్​ భగీరథ  ప్రారంభమైన తర్వాత ఎక్కడా తాగునీటి ఇబ్బందులు లేవని  ప్రభుత్వం చెబుతున్నా పట్టణ శివారు ప్రాంతాలు, గిరిజన తండాలు, గ్రామాల్లో కష్టాలు తప్పడం లేదు. పైపు లైన్​ లీకేజీలు, కరెంట్​ సమస్యలు, ఇతర కారణాలతో మిషన్​ భగీరథ తాగు నీటి పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రజలు తాగునీటి కోసం ఆందోళనకు దిగుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఆఫీసర్లు నేటికీ వేసవిలో తాగు నీటి ఎద్దడి కోసం యాక్షన్​ ప్లాన్​ రూపొందించ లేదు.

మహబూబాబాద్​ జిల్లాలో..

మహబూబాబాద్​ జిల్లాలో 1,417 ఆవాసాలకు 7,72,763 జనాభాకు, ప్రతీ వారానికి 73.69 (ఎంఎల్​డీల)నీరు అందిస్తున్నామని,1,166 కొత్త  ఓహెచ్​ఎస్​ఆర్​లు, 399 పాత ఓహెచ్​ఎస్​ఆర్​లు, 1,443.92 కిలోమీటర్ల కొత్త పైపులైన్​, 1,232.71 కిలోమీటర్ల పాత పైపులైన్​తో  నీటి సరఫరా చేస్తున్నట్లు ఆఫీసర్లు రిపోర్టులు రూపొందించారు. రైతు వేదికలు, వైకుంఠధామాలు, స్కూల్స్​, అంగన్​వాడీలు, ఆరోగ్య ఉపకేంద్రాలకు మొత్తంగా 80.7 శాతం మిషన్​ భగీరథ నీరు అందిస్తుమంటున్నా క్షేత్ర స్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది.

చేతి పంపులు, వాటర్​ ట్యాంకర్లే దిక్కు..

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని శివారు కాలనీలకు మిషన్​భగీరథ  నీటి సప్లైలో  సమస్యలు ఉన్నాయి. ఇందిరానగర్​, ఎన్​జీవోస్​ కాలనీ, లెనిన్​ నగర్​లో  ఇబ్బందుల వల్ల మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తు న్నారు. మరిపెడ  మున్సిపాలిటీ  మైనారిటీ కాలనీలో మిషన్​ భగీరథ నీరు రాకపోవడంతో మహిళలు ఆందోళనకు దిగినా ఆఫీసర్లు పట్టించుకోలేదు. దీంతో మహిళలు దగ్గరలోని బోరింగ్​ ల వద్ద నీళ్లు తెచ్చుకుంటున్నారు. 

తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు

వేసవిలో తాగునీటి ఇబ్బందులు  లేకుండా చర్యలు చేపడుతాం. మరిపెడ లోని వాటర్​ గ్రిడ్​ వద్ద కరెంట్​ మోటార్ల లో టెక్నికల్​ సమస్యలతో  నీటి సరఫరా లో సమస్య ఏర్పడింది. మహబూబా బాద్​ టౌన్​లో కొన్ని కాలనీల్లో సమస్య ఉంది. వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం.–కృష్ణారెడ్డి, మిషన్​ భగీరథ, ఎస్​ఈ, మహబూబాబాద్​