ఎస్జీటీ పోస్టులకు 6 రోజులు పరీక్షలు.. నవంబర్ 20 నుంచి డీఎస్సీ ఎగ్జామ్స్ ‌‌‌‌

ఎస్జీటీ పోస్టులకు 6 రోజులు పరీక్షలు.. నవంబర్ 20 నుంచి డీఎస్సీ ఎగ్జామ్స్ ‌‌‌‌
  •  
  • 11 జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు :  నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న డీఎస్సీ–2023 ఆన్​లైన్ పరీక్షల షెడ్యూల్‌‌ను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు బుధవారం రిలీజ్ చేశారు. ఆరు రోజుల పాటు ఎస్జీటీ పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎగ్జామ్ పెడ్తామని వెల్లడించారు. పీఈటీ, లాంగ్వేజీ పండిట్లకు ఒక్కో రోజు చొప్పున ఆన్​లైన్ ఎగ్జామ్స్ ఉంటాయని వివరించారు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నెల 6న విద్యాశాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు ఎగ్జామ్స్ ఉంటాయని, తొలిసారిగా ఆన్‌‌లైన్‌‌లో నిర్వహించనున్నామని వెల్లడించింది. ఈ క్రమంలో ఏయే సబ్జెక్టుకు ఎప్పుడు పరీక్షలుంటాయనే షెడ్యూల్​ను తాజాగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు విడుదల చేశారు. 


పీఈటీ పోస్టులకు మినహా మిగిలిన అన్ని పోస్టులకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, సెకండ్ సెషన్​ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగనుంది.


సెంటర్లు ఇవే


హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్(పీడీ మినహా), లాంగ్వేజీ పండిట్ అభ్యర్థులకు160 ప్రశ్నలకు 80 మార్కులు, పీఈటీ, పీడీ అభ్యర్థులకు 200  క్వశ్చన్లకు వంద మార్కులు ఉంటాయని బులెటిన్​లో పేర్కొన్నారు. అయితే ఏ నోటిఫికేషన్‌‌‌‌లో అయినా భర్తీ చేయబోయే పోస్టులకు సంబంధించిన జీతాల వివరాలను ఇస్తారు. కానీ డీఎస్సీ నోటిఫికేషన్​లో అంశాన్ని పేర్కొనకపోవడం గమనార్హం.

నార్మలైజేషన్ లేనట్టే

టీచర్ పోస్టుల కోసం భారీగా అభ్యర్థులు రాసే అవకాశం ఉండటంతో, నార్మలైజేషన్ సమస్య వస్తుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే జిల్లా యూనిట్ గా రిక్రూట్ మెంట్ నిర్వహిస్తుండటంతో, ఆ సమస్య రాకుండా విద్యాశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక జిల్లాలో ఒక సబ్జెక్టుకు సంబంధించి అందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇదీ షెడ్యూల్


నవంబర్ 20, 21 తేదీల్లో నాలుగు సెషన్లలో స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్ఏ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర సబ్జెక్టులకు అన్ని మీడియాలకు సంబంధించిన 
పరీక్షలుంటాయి. 


22న స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) ఎగ్జామ్స్ ఉంటాయి. దీంట్లో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడ, సంస్కృతం సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.
    23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులకు మార్నింగ్ ఒకే సెషన్​లో పరీక్ష ఉంటుంది.
    24న లాంగ్వేజీ పండిట్ పోస్టులకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడ, సంస్కృతం పోస్టులకు పరీక్ష ఉంటుంది.
    25 నుంచి 30 దాకా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్​జీటీ) అన్ని మీడియాల్లోని పోస్టులకు పరీక్షలుంటాయి. 

తొలిరోజు 277 అప్లికేషన్లు

టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ అప్లికేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు సాయంత్రం దాకా 950 మంది ఫీజు చెల్లించగా, దాంట్లో కేవలం 277 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. వచ్చేనెల 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది.