పెబ్బేరులో డ్రగ్స్ రవాణా చేస్తే కఠిన చర్యలు : వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్ రావు

పెబ్బేరులో డ్రగ్స్ రవాణా చేస్తే కఠిన చర్యలు : వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్ రావు

పెబ్బేరు, వెలుగు : డ్రగ్స్ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్​ రావు హెచ్చరించారు. గురువారం పెబ్బేరులో ఆల్ర్ఫాజోలం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా శుక్రవారం పెబ్బేరు పీఎస్ లో మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. గద్వాల జిల్లాకు చెందిన నరసింహగౌడ్ కల్తీ కల్లు తయారీకి వినియోగించే ఆల్ర్ఫాజోలం డ్రగ్ ను విక్రయించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే భాస్కర్ గౌడ్​ అనే వ్యక్తిని అతని దందాలో భాగం చేసుకున్నాడు. నమ్మదగిన సమాచారంతో పెబ్బేరు మార్కెట్​యార్డులో ఆల్ర్ఫాజోలం విక్రయిస్తుండగా రెడ్​హ్యాండెడ్​గా పోలీసులు పట్టుకున్నారు. కర్నూల్​కు చెందిన గోపాల్​గౌడ్, జగదీశ్ గౌడ్​, అనంతపురం జిల్లాకు చెందిన రామకృష్ణ గౌడ్​తో కిలో రూ.2.40 లక్షలకు కొనుగోలు చేసి బయట ఇతర వ్యక్తులకు రూ.4 లక్షల వరకు విక్రయించేవారు.

గురువారం కర్నూలు జిల్లా కొడుమూరుకు చెందిన కుమార్​గౌడ్, కర్నూలు పట్టణానికి చెందిన రమేశ్ గౌడ్, గజేందర్​గౌడ్, లక్ష్మణ్​గౌడ్, నాగర్​కర్నూలు జిల్లా అమ్రాబాద్​కు చెందిన యుగంధర్ గౌడ్​కు విక్రయించడానికి వచ్చినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. ఎన్​డీపీఎస్ యాక్టు కింద నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 9 మంది నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామన్నారు. పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్న ఎస్ఐ యుగంధర్ గౌడ్, సీఐ రాంబాబును డీఎస్పీ అభినందించారు.