ఈ కార్ రేస్ కేసు అప్ డేట్: త్వరలో ఐఏఎస్ అర్వింద్ కుమార్ విచారణ!

ఈ కార్ రేస్ కేసు అప్ డేట్: త్వరలో ఐఏఎస్ అర్వింద్ కుమార్ విచారణ!
  • ఈ కార్ రేస్​ కేసు అప్​ డేట్​: త్వరలో ఐఏఎస్ అర్వింద్ కుమార్ విచారణ!
  • నెల రోజులుగా విదేశీ పర్యటనలో నిందితుడు 
  • జూన్​ 30న స్వదేశానికి రానున్న అర్వింద్
  • నోటీసులు ఇచ్చేందుకు సిట్ రెడీ

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేసు కేసులో రెండో నిందితుడైన సీనియర్  ఐఏఎస్  అరవింద్ కుమార్ ను మరోసారి విచారించేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసింది. అర్వింద్  తన విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం స్వదేశానికి వస్తున్న నేపథ్యంలో అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ నెల 16న బీఆర్‌‌ఎస్‌‌  వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌  కేటీఆర్ ను దాదాపు 8 గంటలకుపైగా విచారించారు. ఆయన చెప్పిన వివరాలతో స్టేట్ మెంట్  రికార్డ్  చేశారు.

 దర్యాప్తులో భాగంగా అర్వింద్‌‌ కుమార్‌‌ను సైతం మరోసారి ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు  తెలిసింది. వచ్చే నెల మొదటి వారంలో ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవడం మొదలు నిధుల మళ్లింపు, నిబంధనల అతిక్రమణ, విదేశీ కంపెనీతో జరిపిన లావాదేవీలు తదితర అంశాలపై సేకరించిన ఆధారాలు, తాజాగా కేటీఆర్‌‌  విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా అర్వింద్‌‌ ను ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపుపై ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఏడాది జనవరి 8న అర్వింద్‌‌ ను తొలిసారి ప్రశ్నించారు. దానికి కొనసాగింపుగా మరోసారి ఆయన స్టేట్మెంట్‌‌ ను నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే, హెచ్‌‌ఎండీఏ బోర్డు మాజీ చీఫ్  ఇంజినీర్‌‌‌‌  బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డిని సైతం రెండోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం.