- ఢిల్లీ టూర్ తర్వాత కీలకంగా మారిన ఈటల నిర్ణయాలు
- రేపు ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా
- బీజేపీలో ఎప్పుడు చేరేది స్పష్టం చేయనున్న ఈటల
ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన తర్వాత ఈటల నిర్ణయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయన శుక్రవారం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. బీజేపీలో ఎప్పుడు చేరుతారో కూడా స్పష్టం చేస్తారని సమాచారం. ఈటల రాజేందర్ రెండు దశాబ్దాలకు పైగా గులాబీ పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించారు. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపిన ఈటల.. మరో ఐదుగురు నేతలతో కలిసి బీజేపీలో త్వరలోనే చేరతారని తెలుస్తోంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీకి వెళ్లడానికి ముందు కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్లతో భేటీ అయ్యారు. మరుసటి రోజు సోమవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అక్కడే రెండు రోజులపాటు ఉన్న ఈటల.. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈటల రాజేందర్కు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు.