నాపై దొంగ లెటర్​ పుట్టిచ్చిన్రు

నాపై దొంగ లెటర్​ పుట్టిచ్చిన్రు
  • నాపై కుట్రలు చేస్తున్నరు
  • నేను దళిత బంధు వద్దన్నట్లు దొంగ లెటర్​ పుట్టిచ్చిన్రు: ఈటల

జమ్మికుంట, వెలుగు: టీఆర్​ఎస్​ లీడర్లు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని, తనపై కుట్రలు చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్  మండిపడ్డారు. ‘‘ఇంటింటికీ దళిత బంధు వద్దని నేను లెటర్​రాసినట్లు టీఆర్​ఎస్సోళ్లు దొంగ లెటర్  పుట్టిచ్చిన్రు. ఆ దొంగ లెటర్ మీద మళ్లీ వాళ్లే ధర్నాలు చేయిస్తున్నరు. కుట్రలు చేస్తున్నరు. నా వల్లే హుజూరాబాద్​కు దళితబంధు వచ్చిందని సంబురపడుతున్న. ఎన్నికల కంటే ముందే అన్ని కుటుంబాలకు దళిత బంధు ఇయ్యాల్నని డిమాండ్​చేసిన. అసొంటి నేను దళితబంధు వద్దని ఈసీకి ఎందుకు లెటర్​ రాస్త? ఎట్ల రాస్త?’’ అని ప్రశ్నించారు. అక్టోబర్​ 30న జరగనున్న ధర్మయుద్ధంలో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. దళితబంధు లాంటి ఎన్ని స్కీములిచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా,  దావత్ లు ఇచ్చినా అవన్నీ ఈటల వల్లనే వచ్చాయని ప్రజలు అంటున్నారని, దీంతో ఏం చెయ్యాలో అర్థంకాని టీఆర్​ఎస్​ లీడర్లు చిల్లర పనులు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. హుజూరాబాద్​ నియోజకవర్గంలోని పలు మండలాల టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు సుమారు 100 మంది బుధవారం ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. జమ్మికుంట పట్టణంలోని ఈటల నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్​ మాట్లాడుతూ.. కేసీఆర్​ అనే వ్యక్తి డబ్బులు ఖర్చు పెట్టడం , సారా పంచడం మాత్రమే కాకుండా బట్టకాల్చి మీద వేసి అభాసుపాలు చేస్తారని, చిల్లర పనులు కూడా చేస్తరని మండిపడ్డారు. తనకు 75 నుంచి -80 శాతం ప్రజలు మద్దతు ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్​ఎస్​ అహంకారానికి వ్యతిరేకంగా, ఆత్మగౌరవానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వరంగల్​ మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, నాయకురాలు నిరూపరాణి, పలు ఊర్ల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.