- నాపై కుట్రలు చేస్తున్నరు
- నేను దళిత బంధు వద్దన్నట్లు దొంగ లెటర్ పుట్టిచ్చిన్రు: ఈటల
జమ్మికుంట, వెలుగు: టీఆర్ఎస్ లీడర్లు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని, తనపై కుట్రలు చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ‘‘ఇంటింటికీ దళిత బంధు వద్దని నేను లెటర్రాసినట్లు టీఆర్ఎస్సోళ్లు దొంగ లెటర్ పుట్టిచ్చిన్రు. ఆ దొంగ లెటర్ మీద మళ్లీ వాళ్లే ధర్నాలు చేయిస్తున్నరు. కుట్రలు చేస్తున్నరు. నా వల్లే హుజూరాబాద్కు దళితబంధు వచ్చిందని సంబురపడుతున్న. ఎన్నికల కంటే ముందే అన్ని కుటుంబాలకు దళిత బంధు ఇయ్యాల్నని డిమాండ్చేసిన. అసొంటి నేను దళితబంధు వద్దని ఈసీకి ఎందుకు లెటర్ రాస్త? ఎట్ల రాస్త?’’ అని ప్రశ్నించారు. అక్టోబర్ 30న జరగనున్న ధర్మయుద్ధంలో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. దళితబంధు లాంటి ఎన్ని స్కీములిచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, దావత్ లు ఇచ్చినా అవన్నీ ఈటల వల్లనే వచ్చాయని ప్రజలు అంటున్నారని, దీంతో ఏం చెయ్యాలో అర్థంకాని టీఆర్ఎస్ లీడర్లు చిల్లర పనులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సుమారు 100 మంది బుధవారం ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. జమ్మికుంట పట్టణంలోని ఈటల నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ అనే వ్యక్తి డబ్బులు ఖర్చు పెట్టడం , సారా పంచడం మాత్రమే కాకుండా బట్టకాల్చి మీద వేసి అభాసుపాలు చేస్తారని, చిల్లర పనులు కూడా చేస్తరని మండిపడ్డారు. తనకు 75 నుంచి -80 శాతం ప్రజలు మద్దతు ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ అహంకారానికి వ్యతిరేకంగా, ఆత్మగౌరవానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వరంగల్ మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, నాయకురాలు నిరూపరాణి, పలు ఊర్ల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.