పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే ఖబర్ధార్

పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే ఖబర్ధార్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ‘ప్రజా దీవెన యాత్ర’ పేరుతో తలపెట్టిన పాదయాత్ర కమలాపురం మండలం బత్తివాని పల్లె నుంచి ప్రారంభమైంది. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు చేసిన అనంతరం ఈటల పాదయాత్రను ప్రారంభించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి జెండా ఊపారు. ఈటల వెంట బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ ఉన్నారు. పాదయాత్రం ప్రారంభం సందర్భంగా ఈటల.. మీడియాతో మాట్లాడారు. 

‘ఈ పాదయాత్ర పది రోజుల క్రితమే ప్రకటించాం. మా పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే. కానీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిన్న ఓ రైస్ మిల్లును కార్యకర్తల భోజనాల కోసం మాట్లాడుకుంటే.. మిల్లు యజమానిని బెదిరించారు. ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ నాయకత్వంలో ఇలాంటి చిల్లర పనులు జరుగుతున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే మీకు గుణపాఠం తప్పదు. మేం ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదు. ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నాం. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం ఇక్కడి నుంచే మొదలవుతుంది. హుజురాబాద్‌లో ప్రచారం చేస్తున్న ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలకు దమ్ముంటే ముందు మీ దగ్గర పథకాలు అమలు చేయాలి. తెలంగాణకు విముక్తి కావాలంటే తొలి అడుగు ఇక్కడినుంచే పడాలని ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ మాకు అడ్డంకులు సృష్టించాలని, నీచపు పనులు చేయాలని చూస్తే ఖబర్ధార్. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు. చిల్లర వేషాలు వేసేవారిని వదిలిపెట్టం. నా పాదయాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీల విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చారు. ఈ పాదయాత్ర 25 నుంచి 26 రోజుల పాటు ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతోంది. ప్రజలందరూ నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరుతున్నా’ అని ఈటల రాజేందర్ అన్నారు.

పాదయాత్రంలో భాగంగా ఈ రోజు శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాముల పేట, అంబలలో పాదయాత్ర జరగనుంది. పాదయాత్రం అనంతరం ఈటల.. ఈ రోజు రాత్రి అంబాలలో బస చేస్తారు. మొత్తం 23 రోజుల పాటు 127 గ్రామాల మీదుగా 270 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది.