హైదరాబాద్, వెలుగు: ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫాంలు ఇస్తే.. సంబంధిత వ్యక్తులకు కాకుండా ప్రగతి భవన్ నిర్వహణ అధికారులకు నోటీసులు ఎలా ఇస్తారని రాష్ట్ర ఎన్నికల అధికారులపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయినట్టు తెలిసింది. ప్రగతి భవన్ సీఎం క్యాంప్ ఆఫీస్.. ఎన్నికల కోడ్ అమలులోఉన్న సమయంలో అక్కడ పొలిటికల్ యాక్టివిటీస్కు తావివ్వకూడదు. కానీ, అందులో కొందరు బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చారని కాంగ్రెస్ కంప్లయింట్ చేసింది.
అయితే, ‘బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కు గానీ.. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాకుండా ప్రగతి భవన్ నిర్వాహకులకు నోటీసు ఇచ్చి స్పందించాలని కోరడం ఏమిటి? సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రగతి భవన్లో కార్యక్రమాలు చేస్తుంటే.. నిర్వాహకులకు ఆపే అంత ఉంటుందా?’ అని ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులను అడిగినట్లు తెలిసింది.
గతంలో ఇలాంటి సందర్భంలోనే పార్టీలో సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్లకి నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసినట్టు సమాచారం. దీంతో సీఈఓ వికాస్ రాజ్, జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఆఫీసర్ రొనాల్డ్ రాస్ మళ్లీ నోటీసులు ఇవ్వాలా? లేక ప్రగతి భవన్ నిర్వహణలో ఉన్న ఆఫీసర్లు ఇచ్చే రిప్లై ఆధారంగా ముందుకు వెళ్లలా.. అనేదానిపై తర్జన భర్జన పడుతున్నారు. ఆఫీసర్లు ఇచ్చే రిప్లై సంతృప్తికరంగా ఉంటే అంతటితో వదిలేయనున్నట్లు తెలిసింది. లేదంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్కు లేదా వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసు పంపి వివరణ తీసుకునే అవకాశం ఉంది.