తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన ఈడీ సోదాలు.. మల్లారెడ్డి కాలేజీలో కోట్ల నగదు సీజ్

తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన ఈడీ సోదాలు..  మల్లారెడ్డి కాలేజీలో కోట్ల నగదు సీజ్

తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 12మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సీట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. సీట్లను బ్లాక్ చేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని ఈడీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. వరంగల్‌లో నమోదయిన FIR ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటి మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని MNR మెడికల్ కాలేజీ, బొమ్మకల్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీ, ప్రతిమ మెడికల్ కాలేజీ, డెక్కన్, SVS కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.

మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో  సరైన లెక్కలు లేని 1.4 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలో ఉన్న 2.89 కోట్ల రూపాయిలను ఈడీ అధికారులు సీజ్ చేశారు.    మొత్తం 16 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ తో పాటు పలు చోట్ల  తనిఖీలు నిర్వహించారు.  మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు  పలు కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ లు, హార్డు డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.